కరోనాపై యుద్ధమంటే..?

8 May, 2020 02:05 IST|Sakshi

రోగితో కాదు.. రోగంతో పోరాడాలి..

సెల్‌ఫోన్‌ కాలర్‌టోన్‌లో ప్రభుత్వం మార్పులు

రోగులపై వివక్ష చూపొద్దని హితవు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై ప్రపంచమంతా యుద్ధం చేస్తోంది. వైరస్‌ బారిన పడకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు, సలహా సూచనలు చేసేందుకు మొబైల్‌ నెట్‌వర్క్స్‌ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎవరికైనా ఫోన్‌ చేస్తే వెంటనే కరోనా వైరస్‌పై జాగ్రత్తలు చెబుతూ కాలర్‌టోన్‌ వచ్చేలా ఐడియా, ఎయిర్‌టెల్, జియో తదితర నెట్‌వర్క్‌ కంపెనీలు ఏర్పాట్లు చేశాయి. గతంలో దగ్గుతో కూడిన శబ్దంతో అలర్ట్‌ ప్రారంభమయ్యేది. తాజా గా ఈ కాలర్‌టోన్లను కంపెనీలు అప్‌డే ట్‌ చేశాయి. ‘కరోనా వైరస్‌ లేదా కోవిడ్‌–19పై దేశం మొత్తం యుద్ధం చేస్తోంది’ అంటూ కాలర్‌టోన్‌ వినిపిస్తోంది.

జాగ్రత్తలు పాటిస్తే యుద్ధం చేసినట్లే..
కరోనా బారిన పడిన రోగి, వ్యాధి నుంచి బయట పడిన వ్యక్తిపై వివక్ష చూపొద్దని కాలర్‌టోన్‌ సూచిస్తుంది. యుద్ధం చేయాల్సింది రోగం పైన అంటూ.. వ్యక్తిగత శుభ్రత, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం తదితర జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌పై యుద్ధం చేసినట్టేననే  సారాంశంతో కాలర్‌టోన్‌ కొనసాగుతుంది. కోవిడ్‌–19పై చేస్తున్న యుద్ధంలో రక్షణ కవచాలుగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు పోలీసులను వర్ణించింది. ఈ రక్షణ కవచాలను గౌరవించాలని, వారి సూచనలను పాటించాలని, రక్షణ కవచాలను పరిరక్షించుకుని దేశాన్ని గెలిపించాలంటూ కాలర్‌టోన్‌ ముగుస్తుంది. 

మరిన్ని వార్తలు