పాఠశాలల్లో వాటర్‌ బెల్‌

21 Nov, 2019 06:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా తాగునీటిని అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాఠశాలలో ప్రతి రోజూ వాటర్‌ బెల్‌ విధానం అమలు చేయాలని జిల్లాల డీఈవోలు, ఎంఈవోలు, హెడ్‌ మాస్టర్లను ఆదేశించింది.  విద్యార్థులు సరిపడా నీటిని తాగకపోవడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని గుర్తించిన విద్యాశాఖ.. పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు జిల్లా కలెక్టర్లు, డీఈవోలు తగిన చర్యలు చేపట్టాలని సూచించింది.  

వాటర్‌ బెల్‌  సమయంలో విద్యార్థులు నీటిని తాగేలా చూడాలని స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో రోజుకు మూడుసార్లు, మరికొన్ని జిల్లాల్లో నాలుగుసార్లు దీన్ని అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. పాఠశాలలతోపాటు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లలోనూ అమలు చేసేలా చర్యలు చేపట్టింది. 

>
మరిన్ని వార్తలు