‘ప్రాణహిత’పై చర్చిద్దాం రండి!

12 Dec, 2014 02:37 IST|Sakshi

మహారాష్ట్రను కోరిన తెలంగాణ
నాగ్‌పూర్ చీఫ్ ఇంజనీర్‌కు రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారుల లేఖ


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్న ప్రాంతాలపై కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ (సీడబ్ల్ల్యూపీఆర్‌ఎస్) ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నివేదికను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, దీనిపై ఇంకా ఏవైనా అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని కోరింది. అభ్యంతరాలను నివృత్తి చేసి తగినవిధంగా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల అధికారు లు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా చీఫ్ ఇంజనీర్ చౌహాన్‌కు గురువారం లేఖ రాశారు. ప్రాజెక్టుకు జాతీయ హోదాపై అన్ని క్లియరెన్స్‌లు సమర్పించాల్సిన దృష్ట్యా త్వరగా దీనిపై సానుకూల నిర్ణయం చెప్పాలని కోరారు. ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలోని తుమ్మిడిహెట్టి గ్రామంలో నిర్మించదలచిన బ్యారేజీలో ఎత్తిపోసేందుకు రాష్ట్రం నిర్ణయించిన విషయం విధి తమే. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును 152 మీట ర్లుగా నిర్ణయించడాన్ని మహారాష్ట్ర తప్పుపడుతోంది.

 దీనిపై రెండు రాష్ట్రాల అంగీకారం మేర కు బ్యారేజీ ఎత్తు, మహారాష్ట్రలో ముంపు ప్రాంత అధ్యయన బాధ్యతలను సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సం స్థ స్వీకరించింది. అధ్యయనం అనంతరం గత నెల 22న ఇరు ప్రభుత్వాలకు తన నివేదికను అందజేసింది. నివేదికలో బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల ఎత్తుగా నిర్ణయించడాన్ని సమర్థించింది. సంస్థ నివేదిక అందినందున  భూముల సేకరణ ప్రక్రియను వేగిరపరిచేలా సహకారం అందించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపిన దృష్ట్యా బ్యారేజీ నిర్మాణంపై నిరభ్యంతర పత్రం తమకెంతో అత్యావశ్యకమని తెలియజేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో అసెం బ్లీ సమావేశాలు జరుగుతున్నందున చర్చలకు వీలుకాదని, ఈనెల 24న సమావేశాలు ముగి సిన అనంతరం తెలంగాణకు వచ్చేందుకు సిద్ధమని మహారాష్ట్ర అధికారులు వెల్లడించినట్లు సమాచారం. ఇదే విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు  లేఖ రాయాలని ప్రభుత్వ పెద్దలు  భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు