తండాలకు బీటీ తళుకులు

3 Apr, 2019 14:56 IST|Sakshi
చురుగ్గా సాగుతున్న మేడిగడ్డ తండా రోడ్డు పనులు

రోడ్లకు మహర్ధశ, తీరనున్న వాహనదారుల కష్టాలు  

సాక్షి, బాలానగర్‌: మండలంలోని పలు తండాలకు బీటీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. మండలంలోని మేడిగడ్డ, చింతకుంట, చెన్నంగులగడ్డ, నేలబండ తండాలతోపాటు మొదంపల్లి, బోడజానంపేట్‌ వంటి పలు గ్రామాలకు బీటీ రోడ్డు పనులకు గత సంవత్సరంలో జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మేడిగడ్డ తండాకు రూ.కోటి యాబై లక్షలు, నేలబండ తండా హేమాజిపూర్‌కు రూ.2 కోట్లు,  చింతకుంట తండాకు రూ.2 కోట్లు, చెన్నంగులగడ్డ తండా ఎక్వాయపల్లికి రూ.1.5 కోట్లు, మొదంపల్లి నుంచి పలుగుతండాకు రూ.2 కోట్ల నిధులతో సుమారు పది కిలోమీటర్లమేర బీటీ రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి. 

తీరనున్న తండావాసుల కష్టాలు.. 
గతంలో తండా నుంచి మండల కేంద్రానికి, గ్రామ పంచాయతీకి రావాలంటే రోడ్డు సరిగా ఉండేది కాదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఎవరైనా గర్భిణులు కాన్సుకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారు. 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి అంబులెన్స్‌ వచ్చేసరికి కాన్పుకావడం, తల్లి లేదా బిడ్డ వైద్య సదుపాయాలు అందక చనిపోవడం జరిగేది. కానీ ప్రస్తుతం తండాలకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న బీటీ రోడ్లతో తండావాసుల కష్టాలు తీరనున్నాయి. 

తండాలకు మంచిరోజులు  
స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన తండాలకు ఏనాడు బీటీ రోడ్లు వేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రెండు మూడు సంవత్సరాలలోనే తండాలకు బీటీ రోడ్లు వేయడం గిరిజనులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనబడుతుంది.   –జర్పుల లక్ష్మణ్‌ నాయక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు 

తండాలను గ్రామ పంచాయితీలు చేయడం, తండాలకు బీటీ రోడ్లు వేయడం, మంచినీటి కోసం ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకుల నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ప్రతి గ్రామపంచాయతీకి, తండా గ్రామాలకు రోడ్లు వేస్తున్నాం.  
– ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ   

మరిన్ని వార్తలు