2400 గ్రామాల్లో ఇ-పంచాయతీలు

17 Jul, 2014 00:43 IST|Sakshi
2400 గ్రామాల్లో ఇ-పంచాయతీలు

అన్ని సేవలూ ఆన్‌లైన్ ద్వారానే
ఉపాధి చెల్లింపుల కోసం ‘వన్ స్టాప్ షాఫు’  
 అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష

 
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 2,400 గ్రామ పంచాయతీలను ఇ- పంచాయతీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వాటిని కంప్యూటరీకరించి బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. పంచాయతీ పరిధిలో పన్నుల వసూలు, లే అవుట్ ఫీజులు, జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ, మన ఊరు- మన ప్రణాళిక తయారీ, పంచాయతీలో చేపట్టే వివిధ పథకాల వ్యయ నిర్వహణతో సహా అన్ని వ్యవహారాలను ఆన్‌లైన్ ద్వారా చేపడతారు.  గ్రామసచివాలయ స్థాయిలో ఇ- పంచాయతీల ఏర్పాటుపై పంచాయతీరాజ్, ఐటీ శాఖలమంత్రి కె.తారకరామారావు బుధవారం విస్తృతస్థాయిలో సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఐటీ విభాగం, ఎన్‌ఐసీ, ఏపీటీఎస్ అధికారులు, పంచాయతీరాజ్ కమిషనర్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

తెలంగాణలో 8,778 పంచాయతీలుండగా తొలిదశలో 2,400 పంచాయతీలను కంప్యూటరీకరిస్తారు. ఇందులో ‘వన్ స్టాప్ షాపు’ ఏర్పాటు చేసి, దాని ద్వారానే ఉపాధి హామీ చెల్లింపులు, పెన్షన్లు, వాటర్‌షెడ్ తదితర అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ చర్యలు స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీల పాలనలో విప్లవాత్మకమార్పులు తెస్తాయని, పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతాయని ప్రభుత్వం విశ్వసిస్తుంది. వెంటనే ఇ- పంచాయతీలను ప్రారంభించేందుకు ఎన్ని పంచాయతీల పరిధిలో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అందుబాటులో ఉందోనన్న వివరాలను పంచాయతీరాజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు