ఆరోగ్యమంత్రం పఠించనున్న బడ్జెట్‌..!

6 Feb, 2019 03:59 IST|Sakshi

వైద్య ఆరోగ్యశాఖకు రూ. 10 వేల కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి రాష్ట్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనను ఆ శాఖ సిద్ధం చేసింది. 2019–20 బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్‌ సర్కార్‌ ఆలోచిస్తుంది. ఆ మేరకు వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు కూడా భారీగా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కొలిక్కి వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గత బడ్జెట్లో ఈ రంగానికి రూ.7,370 కోట్లు కేటాయించింది. ఇవికాకుండా ఆరోగ్యశ్రీకి రూ.699 కోట్లు కేటాయించటంతోపాటు, ఆస్పత్రులను అభివృద్ధి చేయటంలో భాగంగా రూ. 600 కోట్లతో వైద్య పరికరాలను కొనుగోలు చేసింది. ఈసారి దానికి అదనంగా మరో రూ. మూడు వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని వైద్య ఆరోగ్యశాఖ కోరింది. బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రధానంగా మూడు నాలుగు ప్రాధాన్యరంగాలను ప్రభుత్వం ఎంచుకొన్నట్టు సమాచారం. వీటిలో మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేయబోతోంది. అలాగే కేసీఆర్‌ కిట్ల పంపిణీకి కూడా నిధులు పెంచాలని యోచిస్తుంది. సర్కారీ దవాఖానాల్లో ప్రసవాల శాతం పెంచడం, రోగ నిర్ధారణ పరీక్షల కోసం డయాగ్నస్టిక్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.   

>
మరిన్ని వార్తలు