ఉండలేము.. వెళ్లలేము!

17 May, 2020 03:02 IST|Sakshi
గల్ఫ్‌ కార్మికుల పట్ల ప్రభుత్వాలు స్పందించాలని కోరుతూ వందే భారత్‌ గల్ఫ్‌ భరోసా దీక్ష చేపట్టిన ప్రవాసీయులు

స్వరాష్ట్రానికి రావాలనుకునే వారికి గుదిబండగా విమాన, క్వారంటైన్‌ ఖర్చులు

ఉపాధి కోల్పోయి తిరిగివచ్చేవారిపై ఆర్థిక భారం మోపడంపై గల్ఫ్‌ ప్రవాసీల నారాజ్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత క్వారంటైన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌

ప్రభుత్వాలు స్పందించేలా ఉద్యమానికి తెరలేపిన గల్ఫ్‌ జేఏసీ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సృష్టించిన కల్లోలంతో స్వరాష్ట్రానికి రావాలనుకుంటున్న గల్ఫ్‌ వలస కార్మికులకు విమాన ప్రయాణ ఖర్చు, క్వారంటైన్‌ ఖర్చు గుదిబండగా మారింది. విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పో యి ఇంటి బాట పట్టిన వారికి ఆర్థికంగా భారంగా పరిణమించింది. ఇతర రాష్ట్రాలు ఉచిత క్వారంటైన్‌ సౌకర్యం కల్పిస్తుండగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం పెయిడ్‌ క్వారంటైన్‌ తప్పనిసరి చేయడంతో లబోదిబోమంటున్నారు. గల్ఫ్‌ నుంచి తిరుగుముఖం పట్టేవారి ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ గల్ఫ్‌ వర్కర్స్‌ జేఏసీ పోరుబాట పట్టింది. వలస కార్మికులకు సంఘీభావంగా వందేభారత్‌ గల్ఫ్‌ భరోసా దీక్షలు చేపడుతోంది.ఉచిత విమాన టికెట్టు, ఉచిత క్వారంటైన్‌ను కల్పించాలని కోరుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి గల్ఫ్‌ జేఏసీ రంగం సిద్ధం చేస్తోంది.

గల్ఫ్‌ యుద్ధ సమయంలో... 
గల్ఫ్‌ యుద్ధ సమయంలో అక్కడి నుంచి 1.70 లక్షల మంది భారతీయులను మన దే  శానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. వీరి విమాన ప్రయాణ ఖర్చులను అప్పటి ప్రధాని వీపీ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వమే భరించింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్న జేఏసీ.. రెక్కాడితేగానీ డొక్కాడని వలస కార్మికుల ప్రయాణ, క్వారంటైన్‌ ఖర్చులను కూడా  ప్ర భుత్వాలే భరించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

3 రాష్ట్రాల్లో ఉచితంగానే క్వారంటైన్‌... 
విదేశాల నుంచి వచ్చే తమ రాష్ట్రాల వారికి ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు ఉచితంగానే క్వారంటైన్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వలస కార్మికులకు ఉచిత క్వారం టైన్‌ కల్పిస్తామని, ఏర్పాట్లు కూడా చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎందుకోగానీ పక్కనపెట్టేశారు.

అంత ఎలా భరించాలి... 
ప్రవాసీలకు విమాన ప్రయాణం, క్వారంటైన్‌ ఫీజు భారంగా మారింది. విమాన టిక్కెట్‌ రెట్టింపు చేయగా, క్వారంటైన్‌కు రూ.15 వేల ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ మాత్రమే విమానాలను నడుపుతోంది. ఇతర సంస్థలు నడపకపోవడంతో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ నే ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఆ సంస్థ నిర్దేశించిన భారీ చార్జీలను చెల్లించాల్సివస్తోంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతా ల్లో హోటళ్లలోగాకుండా.. స్వస్థలాలకు చేరువల్లోని హోటళ్లలో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కొంతమేర భారం తగ్గుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.

ప్రభుత్వాలు స్పందించే వరకు పోరాటం 
గల్ఫ్‌ నుంచి రావాలనుకుంటున్న కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగానే విమాన టికెట్లు, క్వారంటైన్‌ సౌకర్యం కల్పించాలి. ఈ అంశాలపై ప్రభుత్వాలు స్పందించే వరకు మా పోరాటం కొనసాగుతుంది.     
– గుగ్గిళ్ల రవిగౌడ్, గల్ఫ్‌ వర్కర్స్‌ జేఏసీ కన్వీనర్‌

ప్రవాసీయుల్లో చైతన్యం కోసం కృషి... 
గల్ఫ్‌ ప్రవాసీయుల సమస్యలపై అందరిలో చైతన్యం తీసుకురావడం కోసం జిందగి ఇమేజెస్‌ ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశాం. కార్మికుల సమస్యలపై ఫేస్‌బుక్‌ ద్వారా లైవ్‌ కార్యక్రమం నిర్వహించి సమస్యలపై చర్చలను కొనసాగిస్తున్నాం. – చేగొండి చంద్రశేఖర్, జిందగి ఇమేజెస్‌ ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు

>
మరిన్ని వార్తలు