16 నుంచి ఒంటిపూట

11 Mar, 2020 02:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ పాఠశాలలు.. ఇతర అన్ని యాజమాన్యాలు, అన్ని మీడియంల పాఠశాలలు అన్నింటికీ వచ్చే సోమవారం (16వ తేదీ) నుంచి ఒంటి పూట బడులుగా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా కమిషనర్‌ చిత్రా రామ్‌చంద్రన్‌ ప్రకటించారు. వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో 16 నుంచి ఒంటి పూట బడులను కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు కొనసాగించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని 12:30 గంటలకు పెట్టాలని పేర్కొన్నారు. పాఠశాలలకు వచ్చేనెల 23వ తేదీ చివరి పని దినమని, 24వ తేదీ నుంచి వేసవి సెలవులు వర్తిస్తాయని  వెల్లడించారు. తిరిగి పాఠశాలలు (కొత్త విద్యా సంవత్సరం) జూన్‌ 12 నుంచి ప్రారంభం అవుతాయని వివరించారు. రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈవోలు ఈ ఉత్తర్వులను అన్ని పాఠశాలలకు పంపించాలని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు