కోర్టులంటే లెక్క లేదా..?

14 Dec, 2019 02:51 IST|Sakshi

అధికారుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: ‘కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్క లేకుండా పోతోంది. ఒకరిద్దరు అధికారులను కోర్టు ధిక్కార కేసుల్లో జైళ్లకు పంపితేగానీ మొత్తం అందరూ దారికి వచ్చేట్లు లేరు. పలువురు అధికారుల్లో నిలువెల్లా నిర్లక్ష్యం కనబడుతోంది. కోర్టు ఆదేశాలను గౌరవిస్తారా లేక వాటికి ఎలా విలువ ఇవ్వాలో చెప్పాలా..?’అని ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కార కేసులో అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేయడంలోనూ ఆలస్యం చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైకోర్టులో ఏకంగా 2 వేల కోర్టు ధిక్కార కేసులు పెండింగ్‌లో ఉంటే అందులో ఒకే జడ్జి వద్ద ఏడెనిమిది వందల కేసులు ఉన్నాయంటే అధికారులు కోర్టు ఆదేశాల్ని ఏ మేరకు ధిక్కరిస్తున్నారో స్పష్టమవుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ కేసులో కోర్టు ఆదేశాలపై అప్పీల్‌ను 466 రోజులు ఆలస్యంగా చేసినందుకు గాను ఆలస్యాన్ని మన్నించి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అభ్యర్థన చేయడంతో ధర్మాసనం నిప్పులు చెరిగింది. విచారణ సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ను ఉద్దేశించి పైవిధంగా హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది.

గౌరవం నేర్చుకుంటారా.. నేర్పమంటారా..?
స్టేట్‌ లిటిగేషన్‌ పాలసీ రూపొందించాలని, అన్ని శాఖల్లోనూ కోర్టు కేసుల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని గతంలో తాము చేసిన సూచనలు ఏమయ్యాయని ధర్మాసనం ప్రశ్నించింది. 

మరిన్ని వార్తలు