తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

26 May, 2020 17:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జనాభాకు సరిపడ పరీక్షలు చేయకుండా వైరస్‌ వ్యాప్తికి ప్రభుత్వమే కారణమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయడంలేదని, వైద్యులకు మాస్క్‌లు ఇవ్వటం లేదని, రాష్ట్రానికి తిరిగి వస్తున్న వలస కార్మికులకు వసతి కల్పించడం లేదంటూ హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఆయా పిటిషన్లపై న్యాయస్థానం మంగళవారం విచారణ జరుపుతూ.. దేశ వ్యాప్తంగా అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య చాలా తక్కువగా ఉందని మరోసారి గుర్తుచేసింది. అన్ని రాష్ట్రాలు ఐసీఎంఆర్ నిబంధనలు పాటిస్తున్నాంటే రాష్ట్రంలో ఎందుకు సరైన నింబంధనలు పాటించల్లేదని ప్రశ్నించింది. (కరోనా : రాజకీయ సంక్షోభం తప్పదా..!)

ఒక మిలియన్ జనాభాలో కేవలం 545 కరోనా టెస్టులు మాత్రమే చేశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రానికి తిరిగి వస్తున్న వలస కార్మికులకు ఇప్పటి వరకు ఎన్ని టెస్ట్‌లు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై  అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 ,443 మందికి  పరీక్షలు నిర్వహించామని వివరించారు. అడ్వకేట్‌ జనరల్‌ వాదనలతో ఏకభవించని న్యాయస్థానం.. ఇప్పటి వరకు ఎంత మంది ప్రైమరీ,సెకండరీ కాంటాక్ట్‌లకు టెస్ట్‌లు నిర్వహించారో జూన్ మొదటి వారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరీక్షల నిర్వహణపై రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు లేఖలు రాసిందని, దానిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కోరింది. అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశంలోనే లక్ష మంది వైరస్‌ సోకి మృత్యువాడ పడ్డారని దయచేసి అలాంటి పరిస్థితిని రాష్ట్రంలో కల్పించవద్దని పేర్కొంది. (కరోనా: చెలరేగిన హింస.. రాళ్ల దాడి)

మరిన్ని వార్తలు