కరోనా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

6 Apr, 2020 14:41 IST|Sakshi

అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని హైకోర్టులో పిటిషన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రాష్ట్రంలోని పేద, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకూ వైరస్‌ సోకిందని, రాష్టంలోని ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి మాస్క్‌లు, డ్రెస్ కోడ్ ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి కరోనా పరీక్షలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో 1897 యాక్ట్ ప్రకారం ఇంటికే వస్తువులు సరఫరా చేయాలని, పేద ప్రజలు, అసంఘటిత కార్మికులకు షల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు ఉచితంగా భోజనం కల్పించాలి పిటిషనర్‌ వాదించారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలపై ఏప్రిల్‌ 9న మధ్యంతర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తుది నివేదిక ఏప్రిల్ 15 వరకు సమర్పించాలని హైకోర్టు అదేశిస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి హైకోర్టు వాయిదా వేసింది. కాగా  ఈ పిటిషన్‌ను  హైకోర్టు చీఫ్‌ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు.

మరిన్ని వార్తలు