తెలంగాణ యాస, సంస్కృతిని సిలబస్లో పెట్టాలి: టీ-రచయితల వేదిక తీర్మానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మట్టిపోరు చరిత్రను పాఠ్యాంశాలుగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రచయితల వేదిక(తెరవే) అభిప్రాయపడింది. పాలకులు తమ అధికార గద్దెలకు ప్రమాదాలు వాటిల్లే అంశాలను సిలబస్లో చేర్చేందుకు ఒప్పుకోరని, అందుకోసం అవసరమైతే మరో పోరాటం సాగించాల్సి ఉంటుందని పలువురు విద్యావేత్తలు, ఎమ్మెల్సీలు, ఉపాధ్యా య సంఘాల నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటయోధుడు భీంరెడ్డి నరసింహారెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకొని ‘పాఠ్యాంశాలలో పోరువీరుల చరిత్ర’ అనే అంశంపై గురువారం హిమాయత్ నగర్లో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది.
తెరవే అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏ దిక్కుగా ప్రయాణం చేయాలన్న అంశంపై ఉపాధ్యాయ లోకమే దిశానిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యాస, సంస్కృతిని సిలబస్లో పెట్టాలన్నారు. భీంరెడ్డి నరసింహారెడ్డితో పాటు వీర తెలంగాణ పోరాటయోధుల చరిత్రను, 1969, ఇప్పటి మలిదశ పోరు ఘట్టాలను విద్యార్థులకు బోధించాలన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ ఎం.వేదకుమార్, ఇంటర్ విద్యాజాక్ చైర్మన్ మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.