పక్కా వ్యూహంతో ప్రశాంతం

12 Apr, 2019 07:06 IST|Sakshi
నాంపల్లిలోని వ్యాయామశాల హైస్కూల్‌లో ఓటు వేసిన సజ్జనార్‌ దంపతులు

ప్రశాంతంగా ముగిసిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌

నోటిఫికేషన్‌ నాటి నుంచే పోలీసుల ముందస్తు చర్యలు  

ఎక్కడా నమోదు కాని కేసులు

‘ఆ రెండు’ గంటలూ అత్యంత అప్రమత్తంగా బలగాలు

సాక్షి, సిటీబ్యూరో: దాదాపు రెండు నెలలుగా అధికారులు తీసుకున్న చర్యలు, పోలీసుల వ్యూహం ఫలించాయి. ఫలితంగా గురువారం కనీసం ఒక్క ఉదంతం కూడా లేకుండా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ) నుంచి ఉన్నతాధికారులు పరిస్థితుల్ని ఆద్యంతం పర్యవేక్షించారు. నగర కోత్వాల్‌ అంజనీ కుమార్‌తో పాటు ప్రత్యేకాధికారిగా వచ్చిన ఐజీ శశిధర్‌రెడ్డి సైతం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బేరీజు వేయడంతో పాటు డీజీపీ కార్యాలయంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పరిస్థితిని సమీక్షించారు. 2014 ఎన్నికల నేపథ్యంలో సిటీలో మొత్తం 24 కేసులు నమోదు కాగా... ఈసారి ఒక్కటీ నమోదు కాకపోవడం గమనార్హం.

మూడు విభాగాలుగా విభజించి..
ఎన్నికల నోటిషికేషన్‌ వెలువడిన నాటి నుంచి రంగంలోకి దిగిన సిటీ ఎలక్షన్‌ సెల్‌ వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది. పోటీ చేసే అభ్యర్థులు, వారి వివరాలు, అనుచరుల కదలికలు తదితర అంశాలను పక్కాగా బేరీ జు వేయగలిగింది. నగర నిఘా విభాగమైన స్పెష ల్‌ బ్రాంచ్‌ (ఎస్బీ) అధికారులు, క్షేత్రస్థాయి సి బ్బంది అందించిన సమాచారం కీలకంగా మారింది. వీటి ఆధారంగా పోలీసులు అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను పక్కాగా గుర్తించగలిగారు. ఫలితంగా నాలుగు నియోజకవర్గాలతో పాటు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలను ఈ కేటగిరీల్లోకి తీసుకువచ్చారు. 

షాడో పార్టీల సమాచారంతో..
దాదాపు ప్రతి అభ్యర్థితో పాటు అనుచరుల్లోనూ కీలకమైన వారిని అనునిత్యం వెంటాడటానికి నగర పోలీసులు షాడో టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు వారి కదలికల్ని కనిపెట్టి సమాచారం అందిస్తూ వచ్చాయి. వీటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. పోలింగ్‌ రోజున కూడా దాదాపు 100 పార్టీలు విధుల్లో ఉన్నాయి. ఫలితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోగలిగారు. మరోపక్క రెండు నెలలుగా రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులకు కౌన్సిలింగ్, బైండోవర్‌లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దృష్టి పెట్టారు. నగరం బయట, అజ్ఞాతంలో ఉన్న వారి వల్లా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. 

ఆ ‘రెండు’ గంటలు..  
పోలింగ్‌ రోజు చివరి రెండు గంటలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 మధ్య సమయం అత్యంత కీలకం. ఈ వేళల్లోనే దొంగ ఓట్లు ఎక్కువగా పడటం, ఘర్షణలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్‌కు రాని వారి వివరాలు సేకరించే కొన్ని పక్షాలు వారి పేర్లతో వేరే వారిని పంపి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నింస్తుంటారు. దీన్ని అడ్డుకోవడానికి ఇతర పార్టీలు ప్రయత్నాలు చేయడం ఘర్షణలు, గొడవలు దారి తీస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం ‘ఆ రెండు’ గంటలూ అత్యంత అప్రమత్తమైంది. రిజర్వ్‌లో ఉన్న బలగాలను సైతం ఏరియాల్లోకి పంపించి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. 

ఈసారి పోలింగ్‌ బూత్‌లబాధ్యత కేంద్ర బలగాలకు..
కేంద్ర ఎన్నికల సంఘం గతానికి భిన్నంగా ఈసారి పోలింగ్‌ బూత్‌ల బాధ్యతల్ని కేంద్ర సాయుధ బలగాలకు అప్పగించింది. స్థానికంగా పని చేసే పోలీసు అధికారులు ఫలానా వ్యక్తి గెలుస్తాడనో, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో పరోక్షంగా వారికి సహకరించే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడం కోసం ఈసారి కూడా ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాన్నే ఇక్కడా అమలు పరిచింది. అక్కడ నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా వ్యవహరించే స్థానిక పోలీసుస్టేషన్‌ ఇన్‌చార్జ్‌ (జిల్లాల్లో ఎస్‌ఐ, కమిషనరేట్లలో ఇన్‌స్పెక్టర్‌)లతో పాటు పోలీసు సిబ్బందికి బూత్‌ల బాధ్యతలు అప్పగించలేదు. అక్కడి భద్రత, బందోబస్తుల్ని కేంద్ర బలగాలకు అప్పగించింది. ఇదే వి«ధానాన్ని ఇక్కడా అమలు చేస్తూ ఎస్‌ఎస్‌బీ బలగాలను పోలింగ్‌ బూత్‌ ఎంట్రన్స్‌ల వద్ద మోహరించింది.

సైబరాబాద్, రాచకొండ పరిధిలో..
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చేవెళ్ల, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే జీడిమెట్ల, భగత్‌సింగ్‌ నగర్, చింతల్, షాపూర్‌నగర్, గాజులరామారం, ఎల్లమ్మబండ, మూసాపేట్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నౌ నంబర్, సిక్‌ చావనీ, ఎన్‌ఎఫ్డీబీ, హసన్‌నగర్, మైలార్దేవ్‌పల్లిలోని పద్మశాలీపురం, శాస్త్రిపురం, కాటేదాన్‌ పోలింగ్‌ కేంద్రాలను సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు తాగునీరు, టెంట్లు, వృద్ధులకు వీల్‌ చైర్లు తదితర వసతులను పరిశీలించారు. అంతకు ముందు నాంపల్లిలోని వ్యాయామ్‌ శాల హై స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో భార్య అనుపతో కలిసి ఓటు హక్కును సజ్జనార్‌ వినియోగించుకున్నారు. అలాగే మల్కాజ్‌గిరి, భువనగిరితో పాటు మరో మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. భువనగిరి, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాల్లోని పొలింగ్‌ కేంద్రాలను పరిశీలించి అక్కడి భద్రతా ఏర్పాట్లను వీక్షించారు. 

మరిన్ని వార్తలు