సౌదీలో దుబ్బాక వాసి మృతి

16 Aug, 2018 04:36 IST|Sakshi
ఎల్లం (ఫైల్‌ )

దుబ్బాక టౌన్‌: ఊళ్లో ఉపాధి లేక బతుకుదెరువు కోసం గల్ఫ్‌ బాట పట్టిన ఓ కార్మికుడు అనారోగ్యం తో మృతిచెందాడు. దుబ్బాక పట్టణానికి చెందిన చింతకింది ఎల్లం (50) బతుకు దెరువు కోసం సౌదీకి వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 17 ఏళ్లుగా సౌదీలో పనిచేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం ఎల్లం తీవ్ర అస్వస్థతకు గురవడంతో తోటి కార్మికులు ఆసుపత్రిలో చేర్చారు. ఎల్లంకు తలలో రక్తం గడ్డకట్టిపోయి స్పృహ తప్పి పడిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. దీంతో సౌదీలోనే మరో ప్రాంతంలో పనిచేస్తున్న ఎల్లం కుమారుడు నర్సింహులుకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు పది వేల రియాల్స్‌ కావాలని.. తన వద్ద అంత డబ్బు లేదని నర్సింహులు వాపోయాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు తమకు సహాయం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. 

>
మరిన్ని వార్తలు