‘రూ. 17 కోట్లతో రాజేశ్వర పంపును ప్రారంభించాం’

5 Sep, 2019 18:33 IST|Sakshi

సాక్షి, సిరిసిల్లా‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కృషి వల్లే నేడు తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని, అది కళ్లెదుటే కనబడుతోందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోలా ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.  మంత్రి మాట్లాడుతూ .. నాసిక్‌లో మొదలైన గోదావరిని  వేములవాడ రాజన్న ఆలయం చెరువులోకి రప్పించడానికి కేటీఆర్‌ పంపు హౌజ్‌ను ప్రారంభించాలని ఆదేశించారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ఎంతో ఇష్టమైన రాజన్న ఆలయం తప్పకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు.

తెలంగాణ రాకముందు వేములవాడ దేవాలయం ఎలా ఉండేదో... ఇప్పుడేలా ఉందో గమనించాలన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. వేములవాడ రాజన్న దేవాలయం చెరువులోకి గోదావరి జలాలను రప్పించడానికి 17కోట్లతో రాజేశ్వర పంపును ప్రారంభించామన్నారు. తెలంగాణలో అత్యధికంగా భక్తులు వచ్చే పెద్ద గుడి వేములవాడ రాజన్న ఆలయమని, దానిని రూ. 400కోట్లతో దశలవారిగా అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. మిడ్‌ మానేరు ద్వారా లక్షలాది ఎకరాలు సస్య శ్యామలం అవుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా మిషన్‌​ భగీరథతో తాగునీటి సమస్యలు తీరుతున్నాయన్నారు. అలాగే కళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని అతి వేగంగా పూర్తి చేశామని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.

మరిన్ని వార్తలు