సాక్షి, ఆదిలాబాద్: సిద్ధాంతాల పరంగా ఆ రెండు పార్టీలు పూర్తిగా వ్యతిరేకం.. అయితేనేం పరిస్థితులకు అనుగుణంగా అవి ఏకమయ్యాయి. టీఆర్ఎస్కు వ్యతి రేకంగా కలిసి పనిచేస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ల కొత్త రాజకీయంతో ఆదిలాబాద్ ప రిషత్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ కొత్త సమీకరణ లు గులాబీ పార్టీని నిలువరించేలా చేశాయి. రెండు ఎంపీపీ స్థానాలను టీఆర్ఎస్కు దక్కకుండా చూశాయి. మరో ఎంపీ పీ స్వతం త్ర అభ్యర్థికి దక్కడంలో కీలక పాత్ర వహించాయి. ఈ మార్పు ఇప్పుడు ఆదిలాబాద్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నేడు జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుండగా ఈ కలయిక టీఆర్ఎస్లో గుబులు రేపుతోంది.
విప్ జారీ..
నేడు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుండగా కాంగ్రెస్, బీజేపీల కలయిక టీఆర్ఎస్ను షాక్కు గురి చేస్తోంది. ఆదిలాబాద్ జెడ్పీలో 17 స్థానాలు ఉండగా, టీఆర్ఎస్ 9, బీజేపీ 5, కాంగ్రెస్ 3 గెలుచుకున్న విషయం తెలిసిందే.. మెజార్టీ 9 మంది సభ్యులను టీఆర్ఎస్ గెలిచినా జెడ్పీపీఠం దక్కించుకోవడంలో ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావులు జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ నుంచి ఇటీవల ఎంపీగా గెలిచిన సోయం బాపురావు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ జెడ్పీ పీఠం టీఆర్ఎస్కు దక్కకుండా కాంగ్రెస్ మద్దతుతోనైనా నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి ఇటీవల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రాథోడ్ రమేశ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భార్గవ్ దేశ్పాండేలు కలిసి టీఆర్ఎస్కు పీఠం దక్కకుండా బీజేపీతో జత కలిసి తాజా రాజకీయాలు తమకు అనువుగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఆయా పార్టీల వారీగా ఇప్పటికే సభ్యులకు విప్ జారీ చేశారు.
పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సభ్యులు నడుచుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న టీఆర్ఎస్ సభ్యులకు, మాజీ ఎమ్మెల్యే యెండ్ల లక్ష్మీనారాయణ బీజేపీ సభ్యులకు, జిల్లా అధ్యక్షుడు భార్గవ్దేశ్ పాండే కాంగ్రెస్ సభ్యులకు విప్ను జారీ చేసే అధికారాన్ని పార్టీలు కట్టబెట్టాయి. దీనికి సంబంధించి ఈ ముగ్గురు జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్కు పార్టీ పత్రాలను శుక్రవారం అందజేశారు. దీంతో సభ్యులకు ఆయా పార్టీల వారీగా విప్ జారీ చేశారు. నేడు జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన పక్షంలో వారి సభ్యత్వం రద్దు చేసేందుకు ఈ విప్ అధికారం పార్టీ అధిష్టానం కల్పించింది. దీంతో ఈ ఎన్నికలు తాజా రాజకీయాలను వేడెక్కించాయి.
టీఆర్ఎస్ 10కే పరిమితం..
జంప్ దేనికి సంకేతం..
టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎంపీటీసీలు పార్టీ విప్ను దిక్కరించి ఒక స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఇచ్చోడలో ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ నియమాలను దిక్కరిస్తే సహించలేని టీఆర్ఎస్కు ఈ జంప్ ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా శనివారం జెడ్పీలో పార్టీ పరంగా విప్ జారీ చేసినా ఎన్నిక పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ ఎస్టీ (జనరల్) రిజర్వు ఉండగా, ఈ పార్టీ నుంచి 9 మంది సభ్యుల్లో ముగ్గురు ఎస్టీ జెడ్పీటీసీలు ఉన్నారు. నేరడిగొండ, నార్నూర్, భీంపూర్ జెడ్పీటీసీలు అనిల్ జాదవ్, రాథోడ్ జనార్దన్, కుమ్ర సుధాకర్లు గెలుపొందారు. వీరిలో నుంచి ఎవరికి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దింపుతారనేది ఇప్పు డు ప్రాధాన్యత సంతరించుకుంది.
అనిల్ జాదవ్, రాథోడ్ జనార్దన్లు లంబాడా సామాజికవర్గం కాగా, కుమ్ర సుధాకర్ ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినవారు. జిల్లాలో ఇటీవల సోయం బాపురావు ఎంపీగా గెలుపొందడంతో బీజేపీ ప్రభంజనం పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. జెడ్పీలో నేడు జరగబోయే ఎన్నికలో ఏకగీవ్రంగా జరుగుతుందా, లేని పక్షంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి అభ్యర్థిని రంగంలోకి దించుతాయా? అనేది ఆసక్తికరమే.. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరుంటారనే దానిపై అంచనాలతో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రాదేశిక ఎన్నికల చివరి ఘట్టం చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.