సర్వం సన్నద్ధం 

15 Apr, 2019 09:56 IST|Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: పరిషత్‌ ఎన్నికల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు కేటాయింపుతో ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యా యి. ఉమ్మడి జిల్లాలో మూడు దశల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. నోటిఫికేషన్‌ విడుదల కావడమే తరువాయి ఎన్నికలు నిర్వహించేందు కు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 6 నుంచి 14 వరకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తి కానున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాల్లోనూ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి.

నిజామాబాద్‌ జిల్లాలో 25 జెడ్పీటీసీలు, 299 ఎంపీటీసీలు, కామారెడ్డి జిల్లాలో 22 జెడ్పీటీసీలు, 236 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పరిషత్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లాలో 7,78, 456 ఓటర్లు, కామారెడ్డి జిల్లాలో 6,02,752 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తున్నప్పటికీ, ఓట్ల లెక్కింపు మాత్రం ఒకే రోజు పూర్తి చేయనున్నారు. జిల్లా కేంద్రంలోనే ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.

బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు.. 
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించనున్నారు. ఇందుకోసం డివిజన్ల వారీగా ఎన్నికలు జరపనున్నారు. రెండు జిల్లాలోని డివిజన్ల వారీగా మండలాలను విభజించారు. దీనికి ఉన్నతాధికారుల ఆమోదం లభించింది. బ్యాలెట్‌ పత్రాల ద్వారానే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 1,626 పోలింగ్‌ కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 1,267 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తుది పరిశీలన అనంతరం పోలింగ్‌ కేంద్రాల జాబితాను విడుదల చేయనున్నారు.

22న తొలి నోటిఫికేషన్‌.. 
తొలి విడతలో నిజామాబాద్, కామారెడ్డి డివిజన్ల లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 22న మొ దటి నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మే 6న పో లింగ్‌ జరుగనుంది. నిజామాబాద్‌ జిల్లాలో మొద టి విడత నిజామాబాద్‌ రూరల్, మోపాల్, డిచ్‌పల్లి, మాక్లూర్, సిరికొండ, ధర్పల్లి, ఇందల్‌వాయి, నవీపేట మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక, కామారెడ్డి జిల్లాలో మొదటి విడత రామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, సదాశివనగర్, తాడ్వాయి, రాజంపేట మండలాల్లోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు.

మే 10న రెండో విడత.. 
బోధన్, బాన్సువాడ డివిజన్లలో రెండో విడత ఎన్నికలు జరనున్నాయి. ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుండగా, మే 10న పోలింగ్‌ నిర్వహిస్తారు. బోధన్, రెంజల్, ఎడపల్లి, రుద్రూరు, వర్ని, కోటగిరి, మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక, కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ డివిజన్‌ పరిధిలోని బిచ్కుంద, పెద్దకొడప్‌గల్‌ , జుక్కల్, మద్నూరు, బీర్కూరు, నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలాల్లోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు.

మే 14న తుది విడత ఎన్నికలు 
ఆర్మూర్, ఎల్లారెడ్డి డివిజన్లలో తుది విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 30న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మే 14న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని ఆర్మూర్, నందిపేట, వేల్పూరు, కమ్మర్‌పల్లి, జక్రాన్‌పల్లి, బాల్కొండ, ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా, భీమ్‌గల్‌ మండలాల్లో, అలాగే, ఎల్లారెడ్డి డివిజన్‌లోని గాంధారి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, తాడ్వాయి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లో  ఎన్నికలు జరగనున్నాయి.
 
అధికారుల నియామకం.. 
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే అధికారులు, సిబ్బంది నియాయకం దాదాపు పూర్తయింది. నిజామాబాద్‌ జిల్లాలో 3,252 మంది పీవోలు, ఏపీవోలు, 6502 మంది ఇతర సిబ్బందిని నియమించారు. ఇక, జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్‌ అధికారులను ఒక్కో మండలానికి చొప్పున 25 మందిని నియమించారు. అలాగే మొత్తం ఎంపీటీసీలకు సంబంధించి 121 మంది ఆర్వోలు, 121 మంది ఏఆర్వోలను నియమించారు. కామారెడ్డి జిల్లాలో 2534 మంది ఏపీవోలు, పీవోలు, 5,068 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. 24 మండలాలకు రిటర్నింగ్‌ అధికారులను, ఎంపీటీసీ స్థానాలకు గాను 96 మంది ఆర్వోలు, 96 మంది ఏఆర్వోలను నియమించారు. జెడ్పీటీసీలకు సంబంధించి మండల కేంద్రాల్లో నామినేషన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు