మొదటివారంలో ‘పంచాయతీ’ నోటిఫికేషన్‌!

18 Dec, 2018 04:45 IST|Sakshi

ఎన్నికల ఏర్పాట్ల పూర్తికి ఈసీ షెడ్యూల్‌ జారీ

ఈ నెలాఖరులోపు అన్ని సిద్ధం చేయాలని ఆదేశాలు  

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికలకు జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఈ నెల 26లోగా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం జారీ చేసింది. ఓటర్ల నమోదు, తొలగింపునకు సంబంధించి వార్డుల వారీగా అనుబంధ ఓటర్ల జాబితాలను ఈ నెల 18లోగా తయారు చేయాలని కోరింది. పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారుల నియామకం, ర్యాండమైజేషన్‌ను 20లోగా పూర్తి చేయాలని తెలిపింది. రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల నియామకం, శిక్షణను 22లోగా పూర్తి చేయాలని సూచించింది. పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది కేటాయింపు ఉత్తర్వులను 26లోపు పూర్తి చేయాలని వెల్లడించింది. ఈ ఏర్పాట్లు పూర్తయిన తర్వాత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏ క్షణంలోనైనా ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

ఎన్నికల ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష
మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ మాట్లాడుతూ టైమ్‌లైన్‌ ప్రకారం వార్డుల వారీగా బీసీఓటర్ల గుర్తింపును చేపట్టామని, ఈ నెల 31 నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లను కోరామన్నారు. బీసీ రిజర్వేషన్ల గైడ్‌లైన్స్‌ను జారీ చేస్తున్నామన్నారు. 2,3 రోజుల్లోగా రిజర్వేష న్ల ప్రక్రియకు సంబంధించి ఎంపీడీవోలు, ఆర్డీవోలకు శిక్షణ.. జిల్లాలవారీగా వివిధ విభాగాల సీట్ల సంఖ్యను రూపొందించాలని ఆదేశించామన్నారు.

మరిన్ని వార్తలు