‘తుది’ ప్రచారానికి నేటితో తెర 

28 Jan, 2019 12:39 IST|Sakshi
కొండకల్‌లో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెర పడనుంది. ఇప్పటికే ఐదు రోజులపాటు ప్రచారం చేసిన అభ్యర్థులు.. చివరిరోజున మరింత హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ర్యాలీలు, ఓటర్ల ఇంటింటికీ వెళ్లి అభ్యర్థించడం, ఆయా పార్టీల ప్రధాన నాయకులు, ఎమ్మెల్యేలు పర్యటించడం వంటి కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తోంది. ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనుంది.

ఆ తర్వాత అభ్యర్థులు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించేందుకు పావులు కదుపుతున్నారు. తుది విడతగా 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఆరు మండలాల పరిధిలో 198 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇందులో 12 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో ఇక్కడ ఎన్నికలు ఉండవు. మిగిలిన 186 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పల్లెల్లో సర్పంచ్‌ పదవుల కోసం 586 మంది బరిలో నిలిచారు. అలాగే 1,756 వార్డులకుగాను 178 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవిపోను మిగిలిన 1,578 వార్డుల్లో 815 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

మరిన్ని వార్తలు