-

నామినేషన్లకు  నేటితో తెర

9 Jan, 2019 09:46 IST|Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: తొలివిడత ప్రకటించిన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వానికి బుధవారంతో తెరపడనుంది. దీంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో తొలివిడతలో సర్పంచు, వార్డుస్థానాల అభ్యర్థులు నామినేషన్లు క్లస్టర్‌ కేంద్రాల్లో దాఖలు చేస్తున్నారు. తొలిరోజు 53 మంది అభ్యర్థులు సర్పంచు స్థానాలకు, 23 అభ్యర్థులు వార్డుస్థానాలకు నామినేషన్లు సమర్పించగా, రెండోరోజు మంగళవారం సర్పంచ్‌ స్థానాలకు 119, వార్డుస్థానాలకు 277 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. మద్దతుదారులతో కలిసి అభ్యర్థులు   నామినేషన్లు రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లస్టర్‌ కేంద్రాలు అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడుతున్నాయి.

మండలాల వారీగా..
మొదటిరోజు నామమాత్రంగా నామినేషన్లు సమర్పించగా, రెండోరోజు ఊపందుకున్నాయి. మావల మండలంలో సర్పంచు స్థానాలకు 8 నామినేషన్లు దాఖలుకాగా, వార్డుస్థానాలకు 21, ఆదిలాబాద్‌రూరల్‌ మండలంలో 31 సర్పంచు స్థానాలకు, వార్డుస్థానాలకు 116 నామినేషన్లు వచ్చాయి. జైనథ్‌ మండలంలో 31 సర్పంచ్‌ స్థానాలకు, 34 వార్డుస్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అదేవిధంగా బేల మండలంలో 17 సర్పంచ్‌ స్థానాలకు, 47 వార్డు స్థానాలకోసం అభ్యర్థులు నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. తాంసి మండలంలో 22 సర్పంచ్‌స్థానాలకు, 40 వార్డు స్థానాలకు, భీంపూర్‌ మండలంలో 10 సర్పంచ్‌ స్థానాలకు, 19 వార్డుస్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో మంగళవారం నాటికి సర్పంచ్‌ స్థానాలకు 172 నామినేషన్లు దాఖలుకాగా, వార్డుస్థానాలకు 300 నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్లకు  నేడు చివరి గడువు 
గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డుస్థానాల నామినేషన్‌ గడువు బుధవారంతో ముగియనుంది. 10న నామినేషన్ల పరిశీలన, 11న అప్పీల్‌కు ఆఖరుతేదీ, 13న నామినేషన్ల ఉపసంహరణ, బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన, 21న పోలింగ్‌ జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. బుధవారం నామినేషన్లకు చివరి గడువు ఉండడంతో భారీఎత్తున అభ్యర్థులు నామినేషన్లు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు