ఓటెత్తిన పల్లెలు ! 

26 Jan, 2019 08:31 IST|Sakshi
కోడూరులోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండో విడత జీపీల్లో శుక్రవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఓట్లు వేసేందుకు పల్లె ప్రజలు ఉత్సాహం చూపారు. తొలి విడతతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. తొలి విడతలో 84.71 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈ విడతలో 89.5 శాతంగా నమోదైంది. మొత్తంగా రెండో విడత పోలింగ్‌ సైతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ జిల్లాలోని పలు బూత్‌ల్లో పర్యటించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. 
89.5 శాతం రెండో విడత ఎన్నికలు జిల్లాలోని ఏడు మండలాలు, 185 పంచాయతీల్లో జరిగాయి. ఈ సందర్భంగా 89.5 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, తొలి రెండు గంటల్లో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు తక్కువగానే వచ్చారు. ఇక 9 గంటల తర్వాత పోలింగ్‌ శాతం ఒక్కసారిగా పెరిగింది. 9 నుంచి 11 గంటల వరకు ఏకంగా 68.98  శాతం పోలింగ్‌ నమోదైంది. కాగా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వికలాంగుల వెంట సహాయకులు తోడుగా ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్‌ సమయం ముగియనుండగా చివరి గంటలో ఎక్కువ మంది బూత్‌లకు వచ్చారు.

ఉత్సాహంగా.. 
ఓట్లు వేసేందుకు గ్రామాల్లో ప్రజలు ఉత్సహం చూపారు. ముందు నుంచి ప్రభుత్వం కూడా ఓటు హక్కుపై విస్తృతంగా ప్రచారం కల్పించడం.. గ్రామాల్లో అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు చేసిన కృషి ఫలించింది. ఉదయం కాస్తా పలుచగా కనిపించిన జనం సమయం దగ్గర పడుతున్న కొద్ది పోలింగ్‌ బూత్‌లకు ఎక్కువగా రావడం కనిపించింది.

ఓటు హక్కు వినియోగించుకున్న 1,68,169 మంది  
రెండో విడతలో మొత్తం 1,68,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొ త్తం 1,88,845 ఓటర్లలో 1,68.169 మంది ఓటు వేశారు. దీంతో 89.5 శాతంగా పోలింగ్‌ నమోదైంది. కాగా, 1,88,845 మంది ఓటర్లలో 95,367 మంది పురుషులకు గాను 85,075 మంది, 93,478 మంది మహిళలకు గాను 83,094 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కట్టుదిట్టమైన భధ్రత 
జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయమైన టనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ముందుగానే గుర్తించిఛాయా ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించడం సత్ఫలితాలను ఇచ్చింది. కాగా, బందోబస్తు చర్యలను ఎప్పటికప్పుడు ఎస్పీ రెమారాజేశ్వరి పర్యవేక్షించారు. ఈ మేరకు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఘటనలు నమోదు కాకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

మరిన్ని వార్తలు