ఉద్యోగ సంఘాలతో పూర్తికావొచ్చిన సంప్రదింపులు
భారీగా ఫిట్మెంట్ డిమాండ్ చేస్తున్న సంఘాలు
పీఆర్సీ నివేదికలో వాటికి చోటు కష్టమే
ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ నివేదికను ఫిబ్రవరి నెలాఖరులో ఇచ్చేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన కమిషన్ గత నెల రోజులుగా పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా ప్రధాన సంఘాలైన టీఎన్జీవో, టీజీవో తదితర ఉద్యోగ సంఘాలతో గురువారం పీఆర్సీ చైర్మన్ సీఆర్ బీస్వాల్, సభ్యులు మహ్మద్ రఫత్అలీ, ఉమా మహేశ్వర్రావు సమావేశమై చర్చించారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన ఫిట్మెంట్, కనీస మూల వేతనం, ఇంటి అద్దె అలవెన్సులపై చర్చించారు. ఉద్యోగ సంఘాలు భారీ మొత్తంలో ఫిట్మెంట్ డిమాండ్ చేస్తున్నా దానికి సంబంధించిన ప్రతిపాదన పీఆర్సీ నివేదికలో ఉండే అవకాశం కన్పించట్లేదు. సాధారణంగా వేతన స్కేళ్లు, విభాగాల వారీగా ఉద్యోగులు, వారి వేతనాలు, వారు చేస్తున్న పని, వారికి ఇవ్వాల్సిన విభాగాల వారీ వేతనాలే పీఆర్సీ నివేదికలో పొందుపరుస్తారు. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాతే ఫిట్మెంట్ నిర్ణయించి దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రస్తుత కమిషన్ కూడా అదే బాటలో కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా, కేడర్ వారీగా కనీస మూల వేతనం, గరిష్ట వేతనాలను, అలవెన్సులను పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది.
ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతులన్నింటినీ క్రోఢీకరించి, నివేదిక సిద్ధం చేసి ఫిబ్రవరి నెలాఖరులో ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం 43 శాతం మధ్యంతర భృతి (ఐఆర్), 63 శాతం ఫిట్మెంట్, రూ.24 వేల కనీస మూల వేతనాన్ని సిఫారసు చేయాలని కోరుతున్నాయి. తెలంగాణ మొదటి పీఆర్సీలో ఉద్యోగులకు ఫిట్మెంట్ 63 శాతం ఇవ్వాలని పీఆర్సీకి టీఎన్జీవో, టీజీవోలు విజ్ఞప్తి చేశాయి. సమావేశంలో టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్రెడ్డి, మామిళ్ల రాజేందర్, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, సత్యనారాయణ, ఎ.జగన్మోహన్రావు పాల్గొన్నారు.
ఇవీ ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు..