నిర్లక్ష్యమే అసలైన మహమ్మారి

6 Jul, 2020 02:23 IST|Sakshi

స్వేచ్ఛగా బయట తిరుగుతున్న పాజిటివ్, ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తులు

లక్షణాలున్నా బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్న కరోనా బాంబులు

వైరస్‌ వ్యాప్తికి వీరే ప్రధాన కారణం

స్వీయ రక్షణ చర్యలే శ్రీరామరక్ష అంటున్న వైద్యులు  

కూకట్‌పల్లిలో  ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. హోం క్వారం టైన్‌లో ఉండి చికిత్స పొందుతా నన్న అతను.. పదేపదే రోడ్లపై సంచరిం చాడు. ఇరుగుపొరుగు వారి ఫిర్యాదుతో అధికారులు వచ్చి అతన్ని ఇంట్లోనే ఉండాలని హెచ్చరించి వెళ్లారు. శనివారం కరోనా లక్షణాలు ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎంజీబీఎస్‌లో బస్సెక్కి ఆదిలా బాద్‌లో దిగారు. బస్సు దిగాక వారికి పాజిటివ్‌ అని తెలిసింది. దీంతో ఆ బస్సులో ప్రయాణించిన వారంతా పరీక్షలు చేసుకోవాలని అధికారులు సూచించారు.

సాక్షి, హైదరాబాద్‌: విపత్తు కంటే ఉదాసీనత మహా ప్రమాదకరమైనది. కోవిడ్‌ విజృంభిస్తోన్న ఈ సమయంలో పలువురు పాజిటివ్‌ పేషెంట్లు నిబంధనలు పాటించకపోవడం వల్ల సమాజానికి ప్రమాదకరంగా మారారు. సూటిగా చెప్పాలంటే.. కరోనా బాంబుల్లా మారారు. పలువురు కోవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసినా, కోవిడ్‌ లక్షణాలు ఉన్నా.. పరీక్షలు చేయించుకోకుండా.. ఆ విషయం పక్కవారికి తెలియకుండా జాగ్రత్తపడుతూ.. ఇష్టానుసారంగా జనాల్లో తిరిగేస్తున్నారు. ఫలితంగా తమ చుట్టూ ఉన్న అమాయక ప్రజలకు కూడా కరోనా అంటిస్తున్నారు. వ్యాధి తీవ్రత గురించి తెలిసి కూడా.. సామాజిక బాధ్యత ఏమాత్రం లేకుండా సంచరిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ మరికొందరు బస్సుల్లో దూర ప్రయాణాలు సైతం చేస్తున్నారు. దారిలో అనేకమందికి వైరస్‌ను అంటించే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. (కరోనాతో కార్పొరేట్‌ దందా)

సమాజం ఏమంటుందో అని...
ఇలా నిర్లక్ష్యంగా సంచరించేవారికి తమ రోగంకంటే ఆ విషయం తెలిస్తే సమాజం వెలివేస్తుందన్న భయమే ఎక్కువగా ఉంటోంది. అందుకే, కోవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసినా.. ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు కొందరు నానా పాట్లు పడుతున్నారు. తమను ఎక్కడ అంటరానివారిగా చూస్తారో అన్న ఆందోళనతో కోవిడ్‌ పరీక్షల సమయంలో తప్పుడు చిరునామాలు, ఫేక్‌ ఫోన్‌ నెంబర్లు ఇస్తున్నారు. మరికొందరు ఫోన్లోనే చికిత్స తీసుకుంటున్నారు. విషయాన్ని పక్కింటి వారికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. అంతవరకూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, కొందరు మరో అడుగు ముందుకేసి తాము బయటికి రాకపోతే ఎక్కడ పక్కింటి వారికి అనుమానం వస్తుందో అన్న భయంతో.. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు రోజూ మార్కెట్‌కి, కిరాణా షాపులకు వెళ్తూ వైరస్‌ వాహకాలుగా మారుతున్నారు.

ప్రైమరీ కాంటాక్టులతోనూ ముప్పే!
కొంతకాలంగా తెలంగాణలో ప్రముఖులకు, అందులోనూ ప్రజాప్రతినిధుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నేతలకు పాజిటివ్‌ అని తెలిసినప్పటికీ, ఆ నేతల ప్రైమరీ కాంటాక్టులైన అంగరక్షకులు, అనుచరగణం హోంక్వారంటైన్‌కి వెళ్లడం లేదు. తమకు ఏమీ కాదన్న ధీమాతో పలు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల పలువురికి వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదాలు పుష్కలంగా ఉన్నాయి. వీరిని బయట తిరగవద్దని ఎందరు ఎంత మొత్తుకున్నా ఎవరూమాట వినడం లేదు. ఇలాంటి ప్రైమరీ కాంటాక్టుల వల్ల కూడా కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఒక్కరోజు ‘కరోనా’ బిల్లు రూ. 1,50,000)

అప్రమత్తత తప్పనిసరి..
చికిత్సకంటే నివారణ మేలు.. అందుకే కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ఎవరికి కరోనా ఉందో తెలియని పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తప్పనిసరైతే తప్ప బయటికి వెళ్లొద్దని, వెళ్లాల్సి వస్తే.. మాస్క్, శానిటైజర్, గ్లౌజులు వీలైతే హెల్మెట్‌ ధరించాలని సూచిస్తున్నారు. దూరప్రయాణాలు మానుకోవాలని, ముఖ్యంగా ప్రజారవాణాలో ప్రయాణం అత్యంత ముప్పుతో కూడుకుందని హెచ్చరిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు