వాణిజ్య పన్నుల శాఖ ఆల్‌టైం రికార్డు

2 Apr, 2019 05:24 IST|Sakshi
సోమేశ్‌కుమార్‌కు అభినందనలు తెలుపుతున్న ఉద్యోగులు

ఈ ఏడాది రూ.45 వేల కోట్లు దాటిన ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయ రాబడిలో వాణిజ్య పన్నుల శాఖ ఆల్‌టైం రికార్డు సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ.45 వేల కోట్లు దాటిందని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక్క మార్చిలోనే రూ.5 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరినట్టు తెలు స్తోంది. మార్చిలో ఎస్జీఎస్టీ కింద రూ.1,275 కోట్లు వచ్చింది. అయితే, ఇప్పటివరకు అత్యధికంగా ఫిబ్రవరిలో 1,041 కోట్ల ఆదాయం ఎస్జీఎస్టీ కింద రాగా, ఈ నెలలో అంతకు మించి ఆదాయం రావడం గమనార్హం. రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చడంలో కృషి చేసిన శాఖ సిబ్బందిని, అధికారులను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అభినందించారు.  

సమస్యలు పరిష్కరించండి: టీఎస్‌టీఈఏ
వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం గత ఏడాది కన్నా 20 శాతం పెరగడంపట్ల ఆ శాఖ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శాఖ సిబ్బంది, అధికారులు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమయిందని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం (టీఎస్‌టీఈఏ) గౌరవాధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు కె.ఎం.వేణుగోపాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సచివాలయంలో శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలసి అభినందనలు తెలిపారు. శాఖాపరంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించి మరింత ఆదాయం సమకూర్చేలా చేసి ఉద్యోగులు, సిబ్బందికి చేయూతనివ్వాలని వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సోమేశ్‌కుమార్‌ సానుకూలంగా స్పందించినట్టు టీఎస్‌టీఈఏ నేతలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు