కార్మికుల సంక్షేమంలో తెలంగాణ రోల్‌ మోడల్‌ 

27 Jan, 2020 03:28 IST|Sakshi

ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: కార్మికుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం తన నివాసంలో కలసిన రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు, ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలను అమలు చేస్తోందని వినోద్‌ పేర్కొన్నారు. ప్రమాదంలో కార్మికుడు చనిపోతే రూ. 6 లక్షలు చెల్లిస్తోందన్నారు.

ఆడపిల్ల పుడితే రెండు కాన్పుల వరకు ఒక్కొక్కరికి రూ. 30 వేల చొప్పున, ఆడపిల్ల పెళ్లికి మరో రూ. 30 వేలు అందజేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు సంఘం రూపొందించిన గుర్తింపు కార్డులను అందజేశారు.  సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు జాన్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాలస్వామి, కార్యదర్శి రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు