‘తెలంగాణ పల్లె ప్రగతి’

14 Nov, 2014 04:26 IST|Sakshi

నల్లగొండ : నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. షెడ్యూల్ కులాలు, తెగల జనాభా ఎక్కువగా ఉన్న మండలాల్లో సమీకృత గ్రామీణాభివృద్ధి సాధించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో అమలైన టీఆర్‌ఐజీపీ (తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగాం)కి ఇటీవల ‘తెలంగాణ పల్లె ప్రగతి’గా నామకరణం చేశారు. ప్రపం చ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ పథకంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను జిల్లాకు తొలి విడతలో రూ.50 కోట్లు వెచ్చించనున్నారు.

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా చేపట్టనున్న ఈ కార్యక్రమాల ప్రణాళిక పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  ఈ పథ కం అమలుకు తొలి దశలో జిల్లా నుంచి 13 మండలాలు ఎంపిక చేశారు. డీఆర్‌డీఏ నిర్వహించిన బేస్‌లైన్ సర్వే ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబ డిన మండలాలుగా వీటిని గుర్తిం చారు. దేవరకొండ ఏరియాలో శిశు విక్రయా లు, మాతా శిశు మరణాలను అరికట్టేం దుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నా రు.

ఈ పథకంలో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకుగాను డీఆర్‌డీఏ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, ఐసీడీఎస్, వైద్యశాఖల సమన్వయంతో ఆయా మండలాల్లో ప్రజలను, మహిళల ను, రైతులను చైతన్య పర్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. దళారుల బారిన పడి తమ పంటకు గిట్టుబాటు ధరను కోల్పోతున్న రైతులను ఆదుకునేలా ఏర్పాట్లు చేస్తారు.

రైతులను బృం దాలుగా ఏర్పర్చి, వారి పంట ఉత్పత్తులను వారే స్వయంగా మార్కెటింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తారు. ఏ ఎన్‌ఎంల ద్వారా ఆరోగ్య సేవలు, ఐసీడీఎస్ ద్వారా మాతా, శిశు సంరక్షణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలను ఐటీకి అనుసంధానం చేసి పర్యవేక్షిస్తారు.
 
గ్రామపంచాయతీల్లో పౌరసేవ కేంద్రాలు
ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పం చాయతీల్లో ‘మీ సేవ’ తరహాలో పౌర సేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నా రు. ప్రస్తుతం ఈమండలాల్లో 44 మీసేవ కేంద్రాలు పని చేస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు మండల కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయి. చందంపేట, డిండి, దేవరకొండ, పీఏపల్లి వంటి మండలాల్లో పలు చోట్ల మీ సేవ కేం ద్రాలు గ్రామాలకు మంజూరైనప్పటికీ సరైన వసతుల్లేక, విద్యుత్ సమస్య కారణంగా మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేశారు.

అలా కాకుండా పౌర సేవా కేంద్రాలను పక్కాగా పంచాయతీల్లోనే ఏర్పాటు చేస్తారు. మీ సేవ కేంద్రాలు అందించే సేవలకు అదనంగా ఉపాధి హామీ, పెన్షన్ల పంపిణీ, ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ వంటి సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఎంపిక చేసిన మండలాల్లో విజయవంతమైనట్లయితే రెండో దశలో మరిన్ని మండలాలకు విస్తరించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు