రైతుబంధుకు రూ.6 వేల కోట్లు

12 Apr, 2018 01:03 IST|Sakshi

వ్యవసాయ శాఖ ఉత్తర్వులు

20 నుంచి చెక్కుల పంపిణీకి కసరత్తు

బ్యాంకుల్లో నగదు కొరతతో రైతులకు ఇబ్బందే

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సొమ్ము అందించడానికి రూ.6 వేల కోట్లకు ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులిచ్చింది. ఖరీఫ్‌ సీజన్‌ కోసం ఈ నిధులు కేటాయిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. బ్యాంకులు ము ద్రించిన చెక్కులను గురువారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలకు సరఫరా చేయనున్నా రు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు మినహా మిగిలిన 28 జిల్లాలకు మొదటి విడత చెక్కులను జిల్లా వ్యవసాయాధికారులకు పంపిణీ చేస్తా రు. వాటిని గ్రామసభలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వారికే అప్పగించారు.  

చెక్కులిస్తే నగదెట్లా?
చెక్కుల పంపిణీకి పెద్ద ఎత్తున ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో మూడు విడతలు గా రూ. 6 వేల కోట్లు పంపిణీ చేయనుంది. సొమ్మును రైతు ఖాతాలో జమ చేయకుండా ఎక్కడైనా చెల్లుబాటయ్యేలా ఆర్డర్‌ చెక్కులు ఇస్తోంది. వీటిని రాష్ట్రంలో సంబంధిత బ్యాంకు బ్రాంచీలో ఎక్కడైనా జమచేసి డబ్బులు తీసుకునే వీలుంటుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు సమస్య తీవ్రంగా ఉంది. ఏ బ్యాంకుకెళ్లినా రూ.5 వేలకు మించి తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చెక్కులు పొందిన రైతులకు ఇబ్బంది ఎదురవుతుందని వ్యవసాయాధికారులు ఆందోళన చెందుతున్నారు.  

కందుల సొమ్ములోనూ..
ఇటీవల ప్రభుత్వం 2.62 లక్షల మెట్రిక్‌ టన్నుల కందులు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.1,420 కోట్లు జమ చేసింది. ఆ డబ్బుల కోసం వెళ్తే కరెన్సీ కొరత వల్ల ఎంతోకొంత ఇచ్చి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నాయి.  పెట్టుబడి సొమ్ము తీసుకునే రైతులకూ ఇదే సమస్య ఉత్పన్నమవుతుందా అని చర్చ జరుగుతోంది. డబ్బుల కోసం రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసిందే. ఆర్బీఐకి ప్రభుత్వం విన్నవించినా ఇప్పటికీ స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు