రెండో విడతకు సన్నాహాలు 

10 Jun, 2019 10:22 IST|Sakshi

సాక్షి, యాదాద్రి : రెండో విడత గొర్రెల పంపిణీకి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. గత ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. గొర్రెల కాపరుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వడంతోపాటు మాంసం ఉత్పత్తిని పెంచాలన్నది ప్రభుత్వం ధ్యేయం. అందుకోసం గత ఏడాది మొదటి విడతలో 75శాతం సబ్సిడీతో 18 ఏళ్లు నిండిన గొల్ల,కురుమ సామాజిక వర్గానికి చెందిన వారికి గొర్రెలను పంపిణీ చేసింది. త్వరలో రెండో విడత చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు  
లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
 
గత ఏడాది ఇలా..
గొర్రెల పెంపకానికి ముందుకు వచ్చే గొల్ల, కురుమ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. జిల్లాలో 342 గొర్రెల,మేకల పెంపకందారుల సంఘాలు ఉన్నాయి.  2017జూన్‌లో గ్రామ సభలు నిర్వహించి సంఘంలో సభ్యత్వం ఉన్న  ప్రతి ఒక్కరినీ ఎంపిక చేశారు. సభ్యత్వం లేని వారికి సభ్యత్వం ఇచ్చి గొర్రెలను అందజేశారు. గ్రామ సభల ద్వారా ఏ, బీ రెండు జాబితాలను తయారు చేసి మొదటి విడతలో ఏ జాబితాలోని యూAనిట్లకు గొర్రెలను పంపిణీ చేశారు. ముందుగా జిల్లాలో గల  మండలాలు, గ్రామాలు, లబి ్ధదారుల ఎంపిక పూర్తిగా అధికారులు, సంఘాల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో జరిగా యి. ఏ లిస్టులోని లబ్ధిదారులకు 17వేలకుపైగా గొర్రెలను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గొర్రెలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా కొందరికి పంపిణీ చేయాల్సి ఉంది.

బి జాబితాలో..
ప్రస్తుతం బి జాబితాలోని 15,000 మందికి  రెండో విడతలో గొర్రెలను పంపిణీ చేయడానికి  ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండో జాబితాలో 1,543మంది డీడీలు చెల్లించి సిద్ధంగా ఉన్నారు. 1,700 మందికి బి జాబితా లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. మిగతా వారికి పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. రెండో విడతలో గొర్రెలను మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఈ నియమాలను పాటించాలి

  • ఒకే కుటుంబంలోని ఎంత మంది సభ్యులున్నా వారు సంఘాల్లో ఉండవచ్చు. 
  • సంఘాల్లో ఉన్న వారందరికీ సబ్సిడీ గొర్రెల యూనిట్‌ మంజూరు చేస్తారు. 
  • గొర్రెలు ఉన్నవారికి, ఉద్యోగం చేస్తున్న కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. 
  • ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో కలిపి 21 ఇస్తారు.  
  • యూనిట్‌ విలువ రూ.1.25లక్షలు.  
  • బ్యాంకులతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుంది. 
  • యూనిట్‌ మొత్తంలో 25శాతం (రూ.31,250) లబ్ధిదారుడి వాటా, 75 శాతం (రూ.93.750) ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.   
  • లాటరీ పద్ధతిలో గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక చేశారు.  ఉదాహరణకు ఒక గ్రామంలో 60 మంది సభ్యులుంటే అందులో 30 మందిని సంఘాల సభ్యుల సమక్షంలోనే లాటరీ ద్వారా గుర్తించారు.
  • జిల్లా స్థాయిలో కలెక్టర్‌ పర్యవేక్షణ ఉంటుంది. మండల స్థాయిలో తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి, స్థానిక పశువైద్యుడితో కూడిన త్రి సభ్య కమిటీలు ఉంటాయి.
  • పంపిణీ చేసే గొర్రెలను పక్క రాష్ట్రం నుంచే కొనుగోలు చేయాలన్న నిబంధన సడలించారు. 
  • గొర్రెల రవాణా, వాటి బీమా ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది.
  • కొత్తగా ఇచ్చే గొర్రెలతో పాటు పాత జీవాలకు కూడా ఉచితంగా బీమా చేస్తున్నారు.
  • గొర్రె ఆరోగ్య పరిరక్షణకు ఏడాదికి మూడుసార్లు టీకాలు, నట్టల మందు సరఫరా చేస్తారు. 
  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేశారు. 
  • గొర్రెల మార్కెటింగ్‌ కోసం ప్రత్యేక చర్యలు ప్రతి రెండు మూడు మండలాలకు ఒకటి చొప్పున గొర్ల అంగడి ఏర్పాటు చేయాలి. 

ప్రభుత్వ ఆదేశాల కోసం చూస్తున్నాం
మొదటి దశ లబ్ధిదారులను ఎంపిక చేసిన సమయంలోనే రెండో విడతకు లబ్ధిదారులను ఎంపిక చేశాం. నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి వారి వాటాధనం డీడీలు ఆహ్వానిస్తాం. ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఇచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. –మదన్‌కుమార్, జిల్లా పశు వైద్యాధికారి

మరిన్ని వార్తలు