సింగరేణిలో మోగిన సమ్మె సైరన్‌

24 Sep, 2019 09:05 IST|Sakshi

నేటి సమ్మెకు అన్ని సంఘాల మద్దతు  

విజయవంతానికి ఐక్యంగా ప్రచారం 

సమ్మెతో సింగరేణిలో రూ.73 కోట్ల ఉత్పత్తికి విఘాతం? 

గోదావరిఖని(రామగుండం): సుదీర్ఘకాలం తర్వాత సింగరేణిలో సమ్మె సైరన్‌ మోగింది. సంస్థలోని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతోపాటు అన్ని జాతీయ సంఘాలు పిలుపు మేరకు ఒక్క రోజు సమ్మె ప్రారంభమైంది. కార్మికులు విధులకు గైర్హాజరై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె కారణంగా రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. దీంతో సింగరేణి యాజమాన్యానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో సమ్మె ప్రభావం లేకుండా చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. విధలకు హాజరయ్యే కార్మికులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ అరకొరగానే కార్మికులు విధులకు హాజరయ్యారు. 

బొగ్గు గనుల వద్ద బందోబస్తు
సింగరేణి కార్మికులు ఒక్క రోజు సమ్మె ప్రకటించడంతో బొగ్గు గనుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. విధులకు హాజరయ్యే కార్మికులను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ ఉపేందర్‌ హెచ్చరించారు. గనుల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు పలు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. 

ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా..
బొగ్గు పరిశ్రమల్లో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో కార్మిక సంఘాలన్నీ ఏకమయ్యాయి. ఈ నెల 24న సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో మంగళవారం బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోనుంది. గతంలో జాతీయ కార్మిక సంఘాలు సమ్మె పిలుపునిస్తే, సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) వ్యతిరేకించేది. బొగ్గు పరిశ్రమలో వంద శాతం విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ సమ్మె చేయాలని నాలుగు జాతీయ కార్మిక సంఘాలు ఇటీవల నిర్ణయించాయి. సమ్మెకు గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్‌ కూడా సమ్మెకు మద్దతు పలకడంతో సింగరేణిలో సమ్మె సక్సెస్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

స్వరాష్ట్రంలో తొలిసారి మద్దతు 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా టీబీజీకేఎస్‌ సమ్మెలో పాల్గొనాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చి జాతీయ సంఘాల సమ్మెకు మద్దతు పలికింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి కార్మికులు పలుమార్లు సమ్మె చేశారు. సకలజనుల సమ్మెలో సుదీర్ఘంగా 35 రోజులు పాల్గొని కార్మికులు తమ పోరాట స్ఫూర్తిని నిరూపించుకున్నారు. గతేడాది జూన్‌ నెలలో జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చిన్పటికీ, టీబీజీకేఎస్‌ దానికి దూరంగా ఉండడంతో సింగరేణిలో కొంతమంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఈసారి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె జరుగుతోంది. మరోవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో కార్మికవర్గానికి జరిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మద్దతునివ్వకుంటే కార్మికవర్గంలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో జాతీయ సంఘాలకు టీబీజీకేఎస్‌ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

రూ.73 కోట్ల ఉత్పత్తికి విఘాతం.. 
సింగరేణిలో రోజుకు రెండు లక్షల టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. మొన్నటి వరకు గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురువడంతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తరుచూ విఘాతం ఏర్పడింది. సాధారణంగా వర్షాకాలం యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిని కుదించుకుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే దిశగా యాజమాన్యం ప్రణాళిక రూపొందించుకుంది. సింగరేణిలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ నెలలో ఇప్పటి వరకు 292.53 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. గత సంవత్సరంలో ఇదే కాలంతో పోలుచకుంటే 23.41 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అధికంగా జరిగినప్పటికీ, మిగతా ఆరు మాసాల కాలంలో 407.47 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది. 

ప్రస్తుతం వర్షాలతో ఉపరితల గనుల్లో నెలకు సగటున 49 లక్షల టన్నుల మేరకు ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగతా ఆరు నెలల కాలంలో నెలకు 68 లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు రెండున్నర లక్షల టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తి సాధిస్తేనే వార్షిక లక్ష్యం సాధ్యమవుతుంది. ప్రస్తుతం రోజుకు రెండు లక్షల టన్నుల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, సగటున 1.8 లక్షల ఉత్పత్తి జరుగుతోంది. సమ్మె జరిగితే రూ.50 కోట్ల మేర సింగరేణి యాజమాన్యానికి, రూ.23 కోట్లమేర సింగరేణి కార్మికులు జీతాల రూపంలో నష్టపోనున్నారు. బొగ్గు ఉత్పత్తి, కార్మికుల వేతనాలు కలిపి దాదాపు రూ.73 కోట్ల నష్టం జరుగనుంది. 


సమ్మెలోకి వెళ్లనున్న 48 వేల మంది కార్మికులు
సింగరేణిలో మొత్తం 48,019 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రామగుండం రీజియన్‌ పరిధిలోని ఆర్జీ–1, 2, 3, ఏఎల్‌పీ డివిజన్లలో సింగరేణిలోనే అత్యధికంగా 16 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సమ్మెలో పాల్గొనాలని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌లు పిలుపునిచ్చాయి. దీనికి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ మద్దతునిస్తోంది. మరో జాతీయ కార్మిక సంఘమైన బీఎంఎస్‌ ఈ నెల 23 నుంచి 27 వరకు సమ్మెకు పిలుపునిచ్చింది. భాజపాకు అనుకూలంగా వ్యవహరించే బీఎంఎస్‌ సైతం కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండడంతో కోలిండియాలోనూ 24న సమ్మె ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని కార్మిక నేతలు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో సింగరేణిలో కార్మికుల సమ్మె సక్సెస్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

డిమాండ్లు ఇవే...

  • బొగ్గు పరిశ్రమలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐలను) నిలిపివేయాలి. 
  • కోల్‌ ఇండియా మొత్తం విడదీయకుండా ఒకే కంపెనీగా ఉంచాలి. 
  • బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణను నిలిపివేయాలి. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి. 
  • నిలుపుదల చేసిన రిక్రూట్‌మెంట్లను వెంటనే చేపట్టాలి. సింగరేణిలో ఉన్న ఖాళీలను ఇంటర్నల్‌ కార్మికులతో భర్తీ చేయాలి. 
  • లాభాల్లో భాగస్వాములైన కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా చెల్లించాలి. 
  • కారుణ్య నియామకాలు కార్మికులందరికీ వర్తింపజేయాలి. హైకోర్టు తీర్పు ప్రకారం రెండు సంవత్సరాలలోపు సర్వీస్‌ ఉన్న కార్మికులు అన్‌ఫిట్‌ అయినా వారి పిల్లలకు ఉద్యోగాలివ్వాలి. 
మరిన్ని వార్తలు