టెన్త్‌ పరీక్షలు జూన్‌ 8 నుంచి

23 May, 2020 02:56 IST|Sakshi

షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ప్రత్యేక గదుల్లో పరీక్షలు

గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి  

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ జూన్‌ 8 నుంచి పరీక్షలను నిర్వహించేలా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేశారు. ప్రధాన పరీక్షలు జూన్‌ 29తో ముగియ నుండగా ఓరియంటల్, వొకేషనల్‌ పరీక్షలు అన్నీ జూలై 5తో ముగియనున్నాయి. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధిని ఇస్తూ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. భౌతిక దూరం పాటించేలా పరీక్ష కేంద్రాలను పెంచడం, పాత కేంద్రాలకు అర కిలో మీటర్‌ దూరంలో కొత్త కేంద్రాలను ఏర్పా టు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా కేంద్రాలకు విద్యార్థులను పంపిం చేందుకు పాత కేంద్రాల వద్ద సహాయ కులను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఉదయం 9:30 గంటల నుంచి...
పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసా గుతాయి. ఓరియంటల్‌ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. వొకేషనల్‌ థియరీ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది.

ప్రతి బెంచిపై ఒకరే
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం ఉండేలా పరీక్ష కేంద్రాలను పెంచాం. ప్రస్తుతం 2,580 పరీక్షాకేంద్రాలు ఉండగా అదనంగా 2,005 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించు కోనున్నాం. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్‌ చేయడంతోపాటు విద్యార్థులకు మాస్కులను అందిస్తాం. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తాం. ప్రతి బెంచిపై ఒకరే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తాం. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను నడిపిస్తాం. పరీక్షలకు సంబంధించి హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. విద్యార్థులెవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని ప్రత్యేక గదుల్లో పరీక్ష రాయిస్తాం. ఎవరైనా ఇన్విజిలేటర్లకు దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని విధుల నుంచి తప్పించి రిజర్వులో ఉన్న వారిని నియమిస్తాం. సిబ్బంది మాస్కులు ధరించడంతోపాటు చేతులకు గ్లౌజ్‌లు ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

మరిన్ని వార్తలు