మహబూబ్నగర్: పాలమూరు పచ్చబడాలి.. పాత రోజులు మళ్లీ రావాలి.. రాబోయే అతి తక్కువ కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. ఆ నీటితో కళతప్పిన పాలమూరు పంటలతో కళకళలాడేలా చేస్తాం.. అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కరువు కాటకాలతో అల్లాడుతూ జీవకళ కోల్పోయిన జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి బీడు భూముల్లో బంగారు పంటలు పండించే రోజులు త్వరలోనే రానున్నాయి అని భరోసా కల్పించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మొదట మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు జవాన్లతో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఐదేళ్ల కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరించారు. నూతన పంచాయతీరాజ్ చట్టం పరిధిలో గ్రామ పరిపాలనను తీసుకువచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తామన్నారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిపాలనలో క్రమబద్ధతను, జవాబుదారీ తనాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం నూతన పురపాలక చట్టాన్ని రూపొందిస్తుందన్నారు.
అగ్రగామిగా నిలబెడతా..
ఐదేళ్ల కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, అదేస్థాయిలో జిల్లాను కూడా ప్రగతి పథంలో నడిపించి జిల్లాను అగ్రగామిగా నిలబెడతానని మంత్రి అన్నారు. పరాయిపాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయి వెనకబడిందని, విద్యుత్ కోతలతో పారిశ్రామిక రంగం కుదేలయిందని, సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం వల్ల తెలంగాణ పంట పొలాలు పడావు పడిన దుస్థితి నెలకొందని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ఈ దుర్భర పరిస్థితులను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రతి ప్రయత్నం ఫలించిందని, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు.
బంగారు తెలంగాణ దిశగా అడుగులు..
రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్ల కాలంలోనే బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు పడ్డాయని, దేశ ప్రజల దృష్టి అంతా రాష్ట్రం వైపు ఉందని తెలిపారు. కరువు, కాటకాలతో అల్లాడుతూ నిత్య వలసలతో జీవకళ కోల్పోయిన పాలమూరు జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి బీడు భూముల్లో పంటలు పండించడానికి సాగునీరు, తాగునీరు అందించడానికి రూ.35,200 కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, 11 మండలాల్లో 2 లక్షల 17 వేల 240 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
చిన్ననీటి వనరుల పునరుద్ధరణపై మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువులను నీటి నిల్వ సామర్ధ్యం పెంచడానికి ఒండ్రుమట్టి పూడిక తీయుట, చెరువు కట్టలను పటిష్టం చేయడం జరిగిందని, జిల్లాలో ఇప్పటివరకు 638 పనులు పూర్తిచేసి రూ.123 కోట్లు ఖర్చుచేయించామని, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కోయిల్సాగర్ రిజర్వాయర్ కింద ఖరీఫ్, రబీ పంటలకు 19,619 ఎకరాలకు నీళ్లివ్వడం జరిగిందని, దీంతో పాటు 42 చిన్ననీటి పారుదల సంస్థ చెరువులను నింపి అదనంగా 8 చెరువులు నింపడం కోసం 5 తూములు నిర్మాణాల పనులు మొదలెట్టామని వివరించారు. జిల్లాలో ధాన్యం నిలువ చేయడానికి గోదాములు నిర్మాణం కోసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లలో భాగంగా 1,01,723 మంది రైతుల నుంచి సమాచారం సేకరించామని తెలిపారు.
రైతాంగం ఆనందం..
రైతుబంధు పథకం కింద జిల్లాలో ఏడాదికి రెండు దఫాలుగా రూ.8వేల చొప్పున సాయం అందించామని, ఈ ఏడాది నుంచి రూ.10వేల చొప్పున పెంచి అందిస్తున్నామని తెలిపారు. రైతుబంధు కింద జిల్లాలో 2018–19 రబీలో 152.30 కోట్లను, లక్షా 43 వేల 937 మంది రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. రైతుబీమా పథకం కింద జిల్లాలో 93,850 రైతులను అర్హులుగా గుర్తించడం జరిగిందని, 450 మంది రైతులు మరణించగా 443 రైతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.22.15 కోట్లు ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి వివరించారు.
పరుగు పెడుతున్న అభివృద్ధి