తెలంగాణలో ఆర్టీసీకి గ్రీన్‌ సిగ్నల్‌..!

18 May, 2020 14:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో​చిక్కుకుపోయిన వారికి తెలంగాణ సర్కార్‌ శుభవార్తను అందించింది. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలోని గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మంగళవారం నుంచి బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బస్సులో 50 శాతం సీట్లలోనే ప్రయాణికులకు అనుమతి ఇవ్వాలని నిబంధన విధించింది. ప్రయాణికుల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతి బస్సులో శానిటైజర్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్ పూర్తైన తర్వాతే విధుల్లోకి తీసుకోనున్నారు. దీనిపై నేటి సాయంత్రం కేబినెట్‌ భేటీలో ప్రభుత్వానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ నివేదిక ఇవ్వనున్నారు. (ప్రగతి రథాలు సన్నద్ధం)

మరోవైపు ఛార్జీలు పెంచే అంశంపై కూడా మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో అంతరాష్ట్ర సర్వీసులకు అనుమతి ఇచ్చే అవకాశం లేనట్లే తెలుస్తోంది. బస్సు చార్జీలు, రూట్ల అనుమతి వంటి అంశాలపై మంత్రిమండలి సమావేశం అనంతరం పూర్తి వివరాలను తెలియనున్నాయి.  

మరిన్ని వార్తలు