చలికాలం ఎండలు!

10 Dec, 2017 03:02 IST|Sakshi

రాష్ట్రంలో చాలా చోట్ల 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పగలూ రాత్రి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఒకట్రెండు చోట్ల మినహా చాలా ప్రాంతాల్లో నాలుగైదు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్, ఖమ్మం, మెదక్‌లలో 4 డిగ్రీలు అధికంగా 33 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హకీంపేటలోనూ నాలుగు డిగ్రీలు ఎక్కువగా 31 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. భద్రాచలంలో 2 డిగ్రీలు అధికంగా 32 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు పెరిగాయి. మహబూబ్‌నగర్‌లో 3 డిగ్రీలు ఎక్కువగా రాత్రి 20 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, రామగుండంలలో 3 డిగ్రీలు అధికంగా, హైదరాబాద్‌లో 2 డిగ్రీలు అధికంగా 17 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఖమ్మంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 7 డిగ్రీలే నమోదుకాగా, పగటి ఉష్ణోగ్రత మాత్రం దానికి నాలుగు రెట్లకంటే అధికంగా 30 డిగ్రీలు రికార్డు కావడం విశేషం. ఇతర ప్రాంతాల్లో రాత్రి, పగటి ఉష్ణోగ్రతల మధ్య తేడా రెండింతలు అటుఇటుగా నమోదుకాగా, ఆదిలాబాద్‌లో నాలుగింతలకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

>
మరిన్ని వార్తలు