వాహనాల విడుదలకు మోక్షం

8 May, 2020 02:11 IST|Sakshi

రూ.500 జరిమానా చెల్లించి తీసుకెళ్లవచ్చు

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. రూ.500 జరిమానా చెల్లించి తమ వాహనాలను తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. జరిమానా డబ్బులను పేటీఎం, ఫోన్‌ పే, మీ సేవ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. ఇక ఎపిడమిక్‌ డిసీస్‌ యాక్ట్‌ కింద పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలను మాత్రం కోర్టుకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి వైన్‌ షాపులతో పాటు, నిర్మాణ, కిరాణా తదితర వ్యాపారాలకు సర్కారు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కూడా సీజ్‌ చేసిన వాహనాల విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపుగా 1.60 లక్షల వాహనాలను సీజ్‌ చేశారు. ఇందులో సివిల్‌ పోలీసులు లక్షకు పైగా, ట్రాఫిక్‌ పోలీసులు మరో 50 వేల వరకు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తాజా నిర్ణయంతో వాహన దారులకు భారీ ఊరట లభించింది.

మరిన్ని వార్తలు