దుబాయ్‌లో బోరిగాం వాసి మృతి

17 Mar, 2019 19:39 IST|Sakshi
మృతుడి భార్య నుంచి వివరాలు సేకరిస్తున్న సాయేందర్‌

సారంగపూర్‌(నిర్మల్‌): మండలంలోని బోరిగాం గ్రామానికి చెందిన బొల్లి నర్సయ్య(39) అనారోగ్యంతో శుక్రవారం దుబాయ్‌లో మృతి చెందాడని ఆయన కుటుంబీకులు తెలిపారు. వారి కథనం ప్రకారం మృతుడు నర్సయ్య ఉపాధి కోసం దుబాయిలోని అబుదాభికి వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న క్రమంలో అనారోగ్యానికి గురికావడంతో రెండు నెలల కిందట స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం తిరిగి 20 రోజుల కింద మళ్లీ దుబాయ్‌ వెళ్లాడు. కానీ, అక్కడ మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు.

దీంతో అక్కడి కంపెనీ యాజమాన్యం ఆయనను అబుదాభిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ నర్సయ్య శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. నర్సయ్య మృతి వార్త తెలుసుకున్న వలస కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతుగంటి సాయేందర్‌ బోరిగాం చేరుకుని ఆయన భార్య ప్రమీల నుంచి వివరాలు సేకరించారు. అలాగే మృతుడు బొల్లి నర్సయ్యకు చెందిన ఆధార్‌కార్డు తదితర వివరాలు తెలుసుకొని త్వరలో అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని సాయేందర్‌ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఆరేళ్ల లోపు వయసున్న ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.   

మరిన్ని వార్తలు