‘ప్రాదేశిక’ లెక్కింపునకు పటిష్ట బందోబస్తు

3 Jun, 2019 09:10 IST|Sakshi
సీపీ కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌క్రైం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పటిçష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కమిషనరేట్‌లోని చొప్పదంగి మండలం రుక్మాపూర్, మానకొండూరు మండలంలోని దేవంపల్లిలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాల, తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రాల వద్ద లెక్కింపు జరుగుతుందని వివరించారు.

ఓట్ల లెక్కింపు పరిసర ప్రాంతాల్లో డాగ్, బాంబ్‌డిస్పోజల్‌ స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏజెంట్లు, లెక్కింపు విధులకు హజరయ్యే అధికారులు, సిబ్బంది డోర్‌ప్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌ ద్వారా వెళ్లాలని తనిఖీలు చేసే సిబ్బందికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ద్వారా జారీ చేసిన గుర్తింపుకార్డులు ఉన్నవారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రం పరిసర ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలు, మూడు డ్రోన్‌ కెమెరాలు వినియోగిస్తున్నామన్నారు. లెక్కింపు కేంద్రాల్లో మొబైల్‌ఫొన్లు వినియోగం నిషేదించడం జరిగిందని, అగ్గిపెట్టెలు, లైటర్లు, పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులు తీసుకెళ్లొద్దని సూచించారు.

కమిషనరేట్‌ వ్యాప్తంగా 144 సెక్షన్‌
ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కమిషనరేట్‌ వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామని తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. బాణాసంచ కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

భారీ బందోబస్తు
భద్రత కోసం వివిధ స్థాయిల పోలీసులను వినియోగిస్తున్నారని సమాచారం. వీరిలో ఇద్దరు అడిషనల్‌ డీసీపీలు, 10 మంది ఏసీపీలు, 21 మంది ఇన్‌స్పెక్టర్లు, 75 మంది ఎస్సై స్థాయి అధికారులతో పాటు వివిధ స్థాయిలకు చెందిన పోలీసులు బందోబస్తు విదులు నిర్వహిస్తారని తెలిసింది. 

మరిన్ని వార్తలు