ఇదిగో భద్రాద్రి

9 Jun, 2017 02:33 IST|Sakshi
ఇదిగో భద్రాద్రి

రాముని సన్నిధికి కొత్త రూపు
రూ.125 కోట్లతో తుది ప్రణాళికలు సిద్ధం
రామదాసు నిర్మిత ఆలయం యథాతథం
యాదాద్రి తరహా అథారిటీ: తుమ్మల


సాక్షి, హైదరాబాద్‌: చుట్టూ మాడవీధులు. దిగువన భారీ కళ్యాణ మండపం. నిత్యాన్న దాన మందిరం. కార్యాలయాలు తదితరాల తో నాలుగంతస్తుల భవనం. దిగువన ఆలయ సముదాయం చుట్టూ 60 అడుగుల రోడ్డు. ఆలయ ప్రధానరోడ్డు 4 వరసలుగా విస్తరణ. చుట్టూ పచ్చికబయళ్లు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం అభివృద్ధికి ప్రభుత్వం రూపొందిం చిన నమూనా ఇది. యాదాద్రి తరహాలోనే భద్రాద్రికీ రూ.125 కోట్లతో కొత్త రూపు ఇవ్వా లని ప్రభుత్వం సంకల్పించడం తెలిసిందే.

ఆలయ అభివృద్ధి నమూనాలకు సీఎం కేసీఆర్, చిన జీయర్‌స్వామి సూచించిన మేరకు మార్పులు, చేర్పులు కూడా చేశారు. వాటికి సీఎం ఆమోదం రాగానే డీపీఆర్‌లు, టెండర్లు, పనుల ప్రక్రియలను ప్రారంభించాలని అధికా రులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. భద్రాద్రి అభివృద్ధి ప్రణాళికలపై దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయిలతో గురువారం ఆయ న సమీక్షించారు. ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామన్నారు. యాదాద్రి మాదిరిగా భద్రాద్రి అభివృద్ధికి అథారిటీ ఏర్పా టు చేసే అవకాశాలు పరిశీలించాలన్నా రు. భక్త రామదాసు స్మారక ట్రస్టు మందిరానికీ ప్రణాళి కలు రూపొందించాలని పేర్కొన్నారు.

పూర్తిగా కొత్త రూపు
భద్రాద్రి ప్రధానాలయం 90 అడుగుల ఎత్తున్న గుట్టపై కొలువుదీరింది. ఇందులో ఆలయం, రాజగోపురం, ఆంజనేయస్వామి దేవాలయం తో కూడిన భక్త రామదాసు నిర్మిత ఆలయ సమూహాన్ని యథాతథంగా కొనసాగిస్తారు. ఆలయం చుట్టూ ఇరుకుగా ఉన్న మాడ వీధు లు, ప్రాకారాలను పూర్తిగా తొలగించి కొత్తగా కడతారు. చుట్టూ అంత ఎత్తుకు సరిపోయేలా మూడంతస్తుల భవన సముదాయం నిర్మి స్తారు. ఆ భవనం పై భాగంలో ఆలయం చుట్టూ మాడవీధులు రూపొందిస్తారు.

 భవనం లో ఆలయానికి ఎడమ వైపు రెండో అంత స్తులో దాదాపు 2 వేల మంది సామర్థ్యంతో కళ్యాణమండపం నిర్మిస్తారు. దాని దిగువన ఆలయ కార్యాలయాలు, ఇతర కార్యాల యాలుంటాయి. కుడివైపు నిత్యాన్నదానశాల, దాని దిగువన వంటశాల, స్వామివార్లకు ప్రసా దాలు రూపొందించే మరో వంటశాల విడిగా ఉంటాయి. గోదావరి వైపు నుంచి నేరుగా ఆల యంలోకి వెళ్లేలా భారీ వంతెన తరహాలో మెట్ల దారి నిర్మిస్తారు. అది ఆలయం ముందు  విస్తరించి కట్టే రోడ్డు మీదుగా సాగుతుంది.

భూసేకరణ లేకుండానే..
ఆలయం దిగువన సింగిల్‌ రోడ్డును ఒకవైపు 40, మరోవైపు 60 అడుగులకు విస్తరిస్తారు. ఇందుకోసం ఒకవైపు రెండు, మూడు ప్రైవేటు నిర్మాణాల తొలగింపు మినహా ఎలాంటి భూసేకరణ అవసరం లేకుండానే ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుత అప్రోచ్‌ రోడ్డును 4 వరసల్లో 100 అడుగులకు విస్తరిస్తారు. దర్శనానంతరం భక్తులు సేదతీరేందుకు విశాలమైన పచ్చిక బయళ్లు నిర్మిస్తారు. మాడవీధుల వద్దా చిన్న పూలతోట ఏర్పాటు చేస్తారు.

మరిన్ని వార్తలు