ప్రతీ డాక్టర్‌కు ‘టెలిమెడిసిన్‌’!

23 Jun, 2020 03:49 IST|Sakshi

రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌కు ఈ కోర్సు తప్పనిసరి

ఎంసీఐ, నీతి ఆయోగ్‌ మార్గదర్శకాలు

సాక్షి, హైదరాబాద్‌: వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఎంసీఐ(మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) ఉపక్రమించింది. సాధారణంగా ఆరోగ్య సమస్యలొస్తే డాక్టర్‌ను నేరుగా సంప్రదించి సలహా తీ సుకోవాలి. కానీ డాక్టర్‌ను నేరుగా కలిసే అంశంలో ఎంసీఐ భారీ మార్పులు తీసుకువచ్చింది. డాక్టర్‌తో నేరుగా కాకుండా ఫోన్‌లో లేదా వీడియో లేదా చాట్‌ ఆధారంగా ఓపీ సేవలు పొందే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు టెలిమెడిసిన్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ విధానం ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. పెద్దగా ప్రాచుర్యంలో లేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి డాక్టర్‌కు టెలిమెడిసిన్‌ సర్టిఫికెట్‌ కోర్సు ను తప్పనిసరి చేస్తూ ఎంసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. నీతి ఆయోగ్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను ఎంïసీఐ రూ పొందించగా.. కేంద్రం దీన్ని ఆమోదిస్తూ గెజిట్‌ విడుదల చేసింది.

సులువుగా వైద్య సేవలు.. 
దేశంలో జనాభా నిష్పత్తికి తగినట్లు వైద్యులు అందుబాటులో లేరు. ఈక్రమంలో వైద్య సేవలను సామాన్యులకు అందించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ కేంద్రం టెలిమెడిసిన్‌ను ప్రవేశపెట్టింది. కరోనా వైరస్‌ ప్ర భావంతో గత 3 నెలలుగా మెజారిటీ క్లినిక్‌లు మూతపడ్డాయి. కొన్నిచోట్ల డాక్టర్లు ఓపీ చూస్తున్నా.. పరిమితంగా సేవలు అందించడంతో చాలా మంది అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం టెలీమెడిసిన్‌ విధానాన్ని ప్రతి ఆర్‌ఎంపీ (రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌)కి తప్పనిసరి చేసింది. వైద్య విద్య పూర్తి చేసి ప్రాక్టీస్‌ పెట్టుకున్న ప్రతి డాక్టర్‌ ఈ సర్టిఫికెట్‌ కోర్సు చేయాల్సిందే. ఈ సర్టిఫికెట్‌ ఆధారంగా రోగితో ఫోన్‌లో, వీడియోకాల్‌ ద్వారా లేదా సామాజిక మాధ్యమాల్లో చాటింగ్‌ పద్ధతిలో కూడా వైద్య సేవ లు అందించొచ్చు. అలాగే ఆరోగ్య స్థితిని క్రమం తప్ప కుండా ఫాలోఅప్‌ చేయొచ్చు. ఈ పద్ధ తితో తక్కువ సమ యంలో ఎక్కువ మంది పేషంట్లను చూసే వీలుంటుంది. ఈ టెలిమెడిసిన్‌ కోర్సుకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్‌ ఇస్తుంది. దాని ఆధారం గా ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్ష నిర్వహించి అర్హత ఆధారంగా సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో.. 
టెలిమెడిసిన్‌ సర్టిఫికెట్‌ కోర్సు పర్యవేక్షణకు సంబంధించి ఎంసీఐ ప్రత్యేకంగా స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటుచేసింది. ఆరుగురు సభ్యులు న్న ఈ కమిటీకి డాక్టర్‌ బీఎన్‌ గంగాధర్‌ చైర్మన్‌ గా వ్యవహరిస్తారు. డాక్టర్‌ నిఖిల్‌ థండన్‌ ఉపాధ్యక్షుడిగా, డాక్టర్‌ మాధురి కనిత్కర్, డాక్టర్‌ కేఎస్‌ శర్మ, డాక్టర్‌ రాజీవ్‌ గార్డ్‌ సభ్యులుగా, డాక్టర్‌ ఆర్‌కే వాట్స్‌ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఈ టెలిమెడిసిన్‌ కోర్సు అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మరో 12 మంది నిపుణులను కూడా నియమించనుంది. ఈ దిశగా ఎంసీఐ ఆన్‌లైన్‌ కోర్సును అభివృద్ధి చేస్తోంది. టెలిమెడిసిన్‌ చికిత్స, నిర్వహణకు సంబంధించి ఎంసీఐ పలు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నో మార్గాలు.. 
టెలిమెడిసిన్‌ విధానంలో రోగులకు సౌకర్యాన్ని బట్టి చికిత్స, సమాచారం ఇవ్వొచ్చని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఫోన్, వీడియో, ఆడియో కాల్, వాట్సాప్, ఫేస్‌బుక్, గూగుల్‌ హ్యాంగౌట్, స్కైప్, ఈ–మెయిల్‌ తదితర మాధ్యమాలతో టెలిమెడిసిన్‌ చికిత్స అందించొచ్చు. టెలిమెడిసిన్‌ విధానానికి సాధారణ వైద్య సేవలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు