ఎట్‌ హోం.. సందడే సందడి

27 Jan, 2019 03:51 IST|Sakshi

సీఎం కేసీఆర్, జానా ఆలింగనం 

ప్రతిపక్ష నేతలతో సీఎం కేసీఆర్‌ పలకరింపు

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం సందడిగా జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం తెలుగు రాష్ట్రా ల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ తేనీటి విందు ఏర్పాటు చేశారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, శాసనమండలి చైర్మన్‌ వి.స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీ, ఏపీ ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ, తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, పార్లమెంట్‌ సభ్యులు కె.కేశవరావు, బండారు దత్తాత్రేయ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, టి.సంతోష్‌కుమా ర్, ఎన్‌.రాంచందర్‌రావు, బి.వెంకటేశ్వర్లు, పి.సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, సీహెచ్‌ మల్లారెడ్డి, బాల్క సుమన్, ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏపీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్, తెలంగాణ ఎన్నికల కమిషన్‌ సీఈవో రజత్‌కుమార్, హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తదితరులు ఎట్‌ హోంకు హాజరయ్యారు. గవర్నర్‌ దంపతులు ఎట్‌ హోం అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. 

పలకరింపులు... ముచ్చట్లు...
ఎట్‌ హోంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేచి వచ్చి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను పలకరించారు. పవన్‌కల్యాణ్‌తో సీఎం కేసీఆర్‌ కొద్దిసేపు ముచ్చటించారు. భట్టి విక్రమార్కను సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు పరిచయం చేయడాన్ని అంద రూ ఆసక్తిగా తిలకించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డి ఎదురుపడగానే కేసీఆర్‌ ఆయన వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎల్‌.రమణ, కె.లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి దగ్గరికి వెళ్లి కేసీఆర్‌ పలకరించారు. భట్టి విక్రమార్క, మహమూ ద్‌ అలీ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. సీఎం కేసీఆర్‌ పక్కనే పవన్‌కల్యాణ్‌ కూర్చున్నారు.

మరోపక్క కేటీఆర్‌ ఉన్నారు. పలు అంశాలపై పవన్‌కల్యాణ్‌తో వారు వేర్వేరుగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల గురించే ఆయనతో మాట్లాడినట్లు తెలిసింది. ఎట్‌ హోంకు వచ్చిన ముఖ్యుల్లో పవన్‌కల్యాణ్‌ ముం దుగానే బయటకు వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోయాక గవర్నర్‌ నరసింహన్, సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ నివాసంలోకి వెళ్లి చాలాసేపు ముచ్చటించుకున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే నేపథ్యంలో ఈ విషయంపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.


 

మరిన్ని వార్తలు