తెలుగు సాహిత్యంలో రాణిస్తున్న ఖాజామైనొద్దీన్
వివిధ కవి సమ్మేళనాల్లో కవితాగానం
పలు సంస్థలతో సత్కారాలు, బహుమతులు
సామాజిక మార్పు లక్ష్యం
సాక్షి, మహబూబ్నగర్ : సామాజిక రుగ్మతలు వెలుగు చూసినా.. అమానవీయ సంఘటన జరిగినా.. వాటి కుళ్లును తన కవితల ద్వారా ఇట్టే కడిగేస్తారు కవి ఖాజామైనొద్దీన్.. తెలుగు భాష కవి సమ్మేళనాలు ఎక్కడ జరిగినా తన కవితాగానంతో భాషాభిమానుల హృదయాలను చూరగొంటున్నారు.. వివిధ రాష్ట్రాల్లో పలు సంస్థలు నిర్వహించే తెలుగు, ఇంగ్లిష్, హిందీ సాహిత్య సభల్లో అనువాదకుడిగా పాల్గొంటూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు.
జిల్లాకు చెందిన ప్రముఖ కవులు నరసింహమూర్తి, వల్లభాపురం జనార్దన, సోదరుడు మహమూద్ల స్ఫూర్తితో కవిగా రాణిస్తున్నాను. మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని చవిచూశాను. సామాజిక మార్పే లక్ష్యంగా రచనలు రావాలి. సాహిత్యరంగం ద్వారా నేటికీ సేవ చేయడం గర్వంగా భావిస్తున్నాను. త్వరలో మరో తెలుగు కవితా సంపుటిని వెలువరిస్తాను.
– ఖాజామైనొద్దీన్, కవి
కుటుంబ నేపథ్యం..
పెబ్బేరు మండల కేంద్రానికి ఖాజామైనొద్దీన్ తన విద్యాభ్యాసం పెబ్బేరు, వనపర్తి, మహబూబ్నగర్లో పూర్తి చేసుకున్నారు. బీఎస్సీ పూర్తి చేసిన ఆయన హిందీ విద్వాన్లో పాసై టీటీసీలో శిక్షణ పొందిన అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకమై 2014లో రిటైర్డ్ అయ్యారు. సాహిత్యసేవను ప్రవృత్తిగా మార్చుకొని కవిత్వంపై ఉన్న ఉత్సాహంతో కవిగా, రచయితగా ఎదిగి కవి సమ్మేళనాల్లో పాల్గొని తనదైన బాణిలో కవితాగానం చేస్తూ సాహిత్యాభిమానుల మన్ననలు పొందుతున్నారు.
బహుమతులు, సన్మానాలు..
ఖాజామైనొద్దీన్ కవితలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందడమే కాకుండా అనేక మ్యాగజైన్లు, పత్రికల్లో ప్రచురించబడ్డాయి. విద్యార్థి దశలో రచించిన కవితలకు నగదు బహుమతులు, ప్రశంసపత్రాలు లభించాయి. పాలమూరు గోస, పాలమూరు కవితలు అనే సంకలనాల్లో కొన్ని చోటు దక్కించుకున్నాయి.