చలో దుబాయ్‌!

13 Jul, 2019 11:09 IST|Sakshi

హైదరాబాద్‌ వాసుల క్రేజీ జర్నీ

అంతర్జాతీయ ప్రయాణాల్లో దుబాయ్‌ టాప్‌

ఏటా 8 లక్షల మందికి పైగా ప్రయాణం

షాపింగ్, టూరిజం, ఉపాధి అవకాశాలే కారణం

దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో మన కరెన్సీ చెల్లుబాటు

సాక్షి, సిటీబ్యూరో: దుబాయ్‌...సామాన్యులకు ఉపాధినిచ్చే గల్ఫ్‌దేశం. బతుకుదెరువు కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వందలాది మంది దుబాయ్‌ ఫ్లైట్‌ ఎక్కుతున్నారు. అనేక రకాల పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఏజెంట్ల చేతుల్లో మోసాలకు గురవుతున్నారు. అక్కడ యజమానుల చేతుల్లో బానిసల్లా బతికేస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు పర్యాటకులను, షాపింగ్‌ ప్రియులను సైతం దుబాయ్‌ ఎంతో ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం నిర్వహించే దుబాయ్‌ ఫెస్టివల్‌ కోసం భారీ సంఖ్యలో పర్యాటకులు బయలుదేరి వెళ్తున్నారు. అందమైన ప్రదేశాలు, ఆకట్టుకొనేవేడుకలు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తోంది. అందుకే హైదరాబాద్‌ నుంచి విదేశాలకు వెళ్తున్న వారిలో దుబాయ్‌ పర్యాటకులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బంగారం నుంచి ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దుస్తులు, వివిధ రకాల ఆభరణాల కొనుగోళ్లపైన పెద్దగా పన్నుల భారం లేకపోవడం ఒక వైపు అయితే మరోవైపు అద్భుతమైన పర్యాటక ప్రదేశాల సందర్శన కూడా వారి మదిని దోచుకుంటోంది. ఇటీవల  దుబాయ్‌లోని మూడు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో  డ్యూటీ ఫ్రీ షాపుల్లో భారత కరెన్సీపైన కొనుగోళ్లు చేసే మరో సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి అనేక అంశాల వల్ల హైదరాబాద్‌ నుంచి విదేశాలకు వెళ్లే  పర్యాటకులు ఎక్కువగా దుబాయ్‌ని ఎంపిక చేసుకుంటున్నట్లు  హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు అధికారులు  అభిప్రాయపడుతున్నారు. 

ఏటా 8 లక్షల మందికి పైగా ప్రయాణం....
హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 10 వేల మంది విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో దుబాయ్‌కి వెళ్లే వాళ్లే 3 వేల మందికి పైగా ఉంటారు. ప్రతి నెలా70 వేల మందికి పైగా వెళ్తున్నారు. వీరిలో ఉపాధి కోసం వెళ్లే కార్మికులు, పర్యాటకులు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్‌ నుంచి జనవరి వరకు జరిగే  దుబాయ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా వెళ్లే పర్యాటకుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఐఆర్‌సీటీసీతో పాటు థామస్‌ కుక్, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు అనేక రకాల ప్యాకేజీలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. పర్యాటక సంస్థల అంచనాల మేరకు ప్రతి సంవత్సరం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సుమారు 9 కోట్ల మంది దుబాయ్‌ని సందర్శిస్తుండగా అందులో  మన దేశం నుంచి వెళ్లేవాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అంచనా. ఏటా కోటీ 22 లక్షల మందికి పైగా  రాకపోకలు సాగిస్తున్నారు. ఇక హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కు వెళ్తున్న వాళ్లే  ఏటా  8 లక్షల మందికి పైగా ఉన్నారు. మిగతా అన్ని గల్ఫ్‌దేశాల కంటే దుబాయ్‌కు వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు  అధికారవర్గాలు  తెలిపాయి. 

పర్యాటకుల స్వర్గధామం..
గ్లోబల్‌ విలేజ్‌. దుబాయ్‌లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ప్రపంచంలోని అనేక దేశాల సంస్కృతులను ప్రతిబింబించే గ్రామం అది. అన్ని దేశాలకు సంబంధించిన భారీ షాపింగ్‌ స్టాళ్లను ఏర్పాటు చేస్తారు.అక్టోబర్,  నవంబర్,డిసెంబర్‌ నెలల్లో  నిర్వహించే  ఈ గ్లోబల్‌ విలేజ్‌  దుబాయ్‌లో  ప్రతిష్టాత్మకమైన ఫెస్టివల్‌. ఆయా దేశాలకు సంబంధించిన సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే వస్తువులు ఈ  గ్లోబల్‌ విలేజ్‌ ఫెస్ట్‌లో ప్రదర్శిస్తారు.దుస్తులు, ఆభరణాలు, వివిధ రకాల ఆకర్షణీయమైన వస్తువులు  పర్యాటకులకు కనువిందు చేస్తాయి.  ఎవరికి ఇష్టమైన వస్తువులను వారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వివిధ దేశాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయి. దుబాయ్‌కు వెళ్లే పర్యాటకులు షాపింగ్‌ను ఎంపిక చేసుకోవడానికి ఈ వేడుకలే కారణం. మరోవైపు అక్కడ లభించే  డ్రైఫ్రూట్స్‌ చాలా ఫేమస్‌. ప్రత్యేకించి  వివిధ రకాల ఖర్జూరాలను  ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ పర్యాటకులకు సాదరంగా స్వాగతం పలికే మరో ప్రదేశం బుర్జ్‌ ఖలీఫా. 124 అంతస్తుల వరకు ఉంటుంది. అక్కడి వరకు సందర్శకులను అనుమతిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడం ఇది. డిసర్ట్‌ సఫారీలో జరిగే గాన భజానాలు, బెల్లిడ్యాన్స్‌ వంటి కార్యక్రమాలు, అన్ని చోట్ల లభించే వివిధ దేశాల  వంటకాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయని  ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారి సంజీవయ్య తెలిపారు. బంగారు ఆభరణాలపైన పన్నులు లేకపోవడం, మహిళలు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండడం కూడా మరో కారణం.

మన కరెన్సీపై కొనుగోళ్లు..
ఇక దుబాయ్‌లోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో  మన రూపాయిపైన కొనుగోళ్లు జరిపే అవకాశం ఇటీవల అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. డ్యూటీఫ్రీ షాపుల్లో  వినియోగదారులు తమకు కావలసిన వస్తువులను రూపాయలు చెల్లించి కొనుక్కోవచ్చు. సాధారణంగా మన రూపాయలను దుబాయ్‌ కరెన్సీలోకి మార్చుకోవాలంటే  కనీసం 2 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అక్కడ ఖర్చు కాగా మిగిలిన డబ్బులను తిరిగి మన రూపాయల్లోకి మార్చుకోవాలనుకొన్నా  ఈ అదనపు చెల్లింపులు తప్పవు. కానీ రూపాయిపైన కొనుగోలు చేసే అవకాశం లభించడం వల్ల  ప్రయాణికులకు ఎంతో ఊరట దక్కింది. అయితే  ఈ సదుపాయాన్ని శాశ్వతంగా కొనసాగిస్తారా లేదా కొంతకాలం పాటు మాత్రమే అమలు చేస్తారా అనే అంశంపైన స్పష్టత లేదని హైదరాబాద్‌ విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. 

మరిన్ని వార్తలు