సాక్షి, బోథ్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో దేవుడి భూములు అన్యాక్రాంతమయ్యాయి. దేవాదాయశాఖకు చెందిన వందలాది భూములు పరాయి వారి చేతుల్లోకి చేరాయి. మొత్తం 111 ఆలయాలకు దాదాపు 3563 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో నుంచి చాలా భూములు కబ్జాకు గురయ్యాయి. కొన్నేళ్ల తరబడి ఈ భూముల్లో వ్యవసాయం సాగిస్తున్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులు భూసర్వేలో అధికారులు దేవాదాయశాఖ భూములు గుర్తించడంలో విఫలమయ్యారు. దేవాదాయశాఖ అధికారులు ఆలయాల పేరు మీద ఉన్న భూముల వివరాలు ఇవ్వాలని ఇప్పటికే కోరారు. అయితే వందలాది ఎకరాలు పరాధీనంలో ఉండడంతో రెవెన్యూ అధికారుల నుంచి స్పందన కరువైందని తెలుస్తోంది. దేవాలయ భూములు గుర్తించి దేవాదాయశాఖకు అప్పగిస్తే..ఆ భూములకు వచ్చే కౌలుతో దేవాలయాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలోని 111 దేవాలయాల దేవుడి భూములు 3563 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 1250 ఎకరాల భూములు ఆలయాల అర్చకుల ఆధీనంలో ఉన్నాయి. మిగతా భూముల విషయంలో దేవాదాయశాఖ అధికారుల వద్ద పాత రికార్డులు, గెజిట్లు ఉన్నా..భూములు మాత్రం పరాయివారి ఆధీనంలో ఉన్నాయి.
ప్రభుత్వ భూసర్వేలో వెల్లడైన దేవాలయాలకు చెందిన భూముల వివరాలు..
జిల్లా | దేవాలయాలు | ఎకరాలు | భూమి ఉన్న ఆలయాలు | గుర్తించిన భూమి |
ఆదిలాబాద్ | 17 | 373 | 8 | 120 |
మంచిర్యాల | 16 | 91 | 6 | 17 |
నిర్మల్ | 72 | 1301 | 16 | 86 |
కుమురంభీం | 6 | 164 | 6 | 122 |
పరాధీనంలో కొన్ని దేవాదాయభూములు
దేవాలయం | విస్తీర్ణం(ఎకరాల్లో) |
జంగం మఠం,బోథ్ | 7.39 |
శ్రీ వేంకటేశ్వర ఆలయం,బోథ్ | 48.29 |
బాలాజీ వేంకటేశ్వర ఆలయం, ఆదిలాబాద్ | 290.35 |
దత్తస్వామి మఠం, సోన్ మండలం | 7.09 |
రామచంద్రస్వామి దేవాలయం, వడూర్,నేరడిగొండ | 48.06 |
వేంకటేశ్వర స్వామి ఆలయం, తాంసి | 39.24 |
హనుమాన్ మందిరం, సీతాగొంది, గుడిహత్నూర్ | 31.24 |
మహాదేవ్ మందిరం,గుడిహత్నూర్ | 16.24 |
రామలక్ష్మణ స్వామి మందిరం, గుడిహత్నూర్ | 10.00 |
వేంకటేశ్వర ధర్మశాల, ఆదిలాబాద్ | 23.31 |
దేవుడి మాన్యాలు స్వాధీనం చేసుకుంటాం
జిల్లాలోని దేవుడి మాన్యాలు స్వాధీనం చేసుకుంటాం. ఈ మేరకు ట్రిబ్యునల్కు వెళ్లాం. భూములకు సంబంధించి రెవెన్యూ అధికారుల నుంచి సమాచారం కోరాం. భూములకు సంబంధించి పాత రికార్డులు, గెజిట్ల ఆధారంగా రెవెన్యూ అధికారులతో కలిసి స్వాధీనం చేసుకుంటాం. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరైనా దేవాదాయ భూములు కబ్జా చేస్తే కోర్టుకు వెళ్తాం.– విజయరామారావు, అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయశాఖ