సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకొని కొంత మేర ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారికి సిటీలో నడిపిన అనుభవం లేకపోవడం వల్ల తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మంగళవారం సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మోతీ నగర్లో కూకట్పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారుపై దూసుకెళ్లింది. ఇన్నోవా డ్రైవర్ గమనించి అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ను తమ అదుపులోకి తీసుకున్నారు. కాగా, కొద్ది నిమిషాల ముందే ఇన్నోవా వాహనంలో స్కూలు పిల్లలను వారి ఇండ్ల దగ్గర వదిలేసి రావడం గమనార్హం.