కార్మికులకు పదో వేజ్‌బోర్డ్‌ ఏరియర్స్‌

13 Jun, 2018 12:27 IST|Sakshi
అభివాదం చేస్తున్న సింగరేణి కార్మికులు  

సాక్షి, గోదావరిఖని : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు (ఎన్‌సీడబ్ల్యూఏ) 10వ వేజ్‌బోర్డ్‌కు సంబంధించిన ఏరియర్స్‌లో 70 శాతం ఈ నెల 14న చెల్లించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ వేజ్‌బోర్డ్‌ వేతనాలు 2016 జూలై 1 నుంచి అమలులోకి రాగా, కంపెనీ నవంబర్‌ 2017 నుంచి కొత్త జీతాలను చెల్లిస్తూ వస్తోంది. కాగా జూలై 2016 నుంచి అక్టోబర్‌ 2017 మధ్య గల 16 నెలల కాలానికి చెల్లించాల్సిన బకాయిలను కంపెనీ కార్మికులకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.51 వేలను ఏరియర్స్‌లో భాగంగా 2017 అక్టోబర్‌ 17న కంపెనీ కార్మికులకు చెల్లించింది.

అయితే కోల్‌ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 10వ వేజ్‌బోర్డుకు సంబంధించి ఏరియర్స్‌లో 70 శాతం మొత్తాన్ని చెల్లించాలని కంపెనీ తాజాగా నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి గతంలో చెల్లించిన రూ.51 వేల ఏరియర్స్‌ను, ఇన్‌కమ్‌ట్యాక్స్, సీఎంపీఎఫ్‌ సొమ్మును మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మికుల బ్యాంకు అకౌంట్లలో ఈ నెల 14న జమ చేయనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. దీని కోసం కంపెనీ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. మిగిలిన 30 శాతం ఏరియర్సును కోల్‌ ఇండియా స్థాయిలో తీసుకునే నిర్ణయం మేరకు కంపెనీ చెల్లిస్తుందని యాజమాన్యం తెలిపింది.  

మరిన్ని వార్తలు