ఈద్గా వద్ద ఉద్రిక్తత

27 Jun, 2017 02:48 IST|Sakshi
- ఎంఐఎం నాయకుడు హాదీ వివాదాస్పద వ్యాఖ్య
మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే గొడవ
 
బషీరాబాద్‌ (తాండూరు): వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ శివారులో ఈద్గా ప్రాంగణంలో రంజాన్‌ సందర్భంగా సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంఐఎం తాండూరు పట్టణ అధ్యక్షుడు హాదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ముస్లిం నేతలు ఆయన వైపు దూసుకొచ్చారు. మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే గొడవ జరిగింది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సమస్య సద్దు మణిగింది. తాండూరు ఈద్గా వద్ద సోమవారం ఉదయం రంజాన్‌ సందర్భంగా వేల సంఖ్యలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీతా సంపత్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఈద్గాలో ప్రార్థనల అనంతరం ముస్లింలకు పండగ శుభాకాంక్షల కార్యక్రమాన్ని ముగించుకొని ఈద్గా ప్రాంగణంలో ఈద్గా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాదీ మాట్లాడారు. ‘తాండూరులో ముస్లింలు కొందరు కడుపులో కత్తులను గుచ్చారు.. రానున్న రోజుల్లో మేమేంటో చూపిస్తాం.. చూడండి’(ఇటీవల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల విషయంలో మోసం చేశారనే నేపథ్యంలో) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పలువురు ముస్లిం నాయకులు ఒక్కసారిగా హాదీ వైపునకు దూసుకొచ్చారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. అప్రమత్తమైన డీఎస్పీ రామచంద్రుడు తదితరులు గొడవ పెద్దది కాకుండా అక్కడున్న వారిని పక్కకు తీసుకెళ్లారు.
మరిన్ని వార్తలు