ఏపీ, టీ ఎన్జీవోల మధ్య ఘర్షణ

26 Sep, 2014 01:07 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. ఏపీఎన్జీవోల నుంచి విడిపోయిన తెలంగాణ ఉద్యోగులకు నగరంలోని కార్యాలయంలో గదిని కేటాయించేందుకు సంఘం నిరాకరించడంతో గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నిర్ణయంపై ఆగ్రహం చెందిన తెలంగాణ ఉద్యోగులు గన్‌పౌండ్రిలోని ఏపీఎన్జీవోల కార్యాలయ భవనం వద్దకు భారీగా తరలివచ్చారు. వారు లోనికి రాకుండా కార్యాలయం గేటుకు ఆంధ్రా ఉద్యోగులు తాళం వేశారు.

దీంతో నగర టీఎన్జీవోల అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, ఇతర తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఏపీఎన్జీవోల నగర అధ్యక్షుడు సత్యానారాయణ, కోశాధికారి కృపావరం, కార్యదర్శి రమణలను నిలదీశారు. ఇరువురి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. చివరకు తాళం విరగ్గొట్టి మరీ తెలంగాణ ఉద్యోగులు భవన ప్రాంగణంలోకి ప్రవేశించారు. కొందరు మహిళా ఉద్యోగులతో కలిసి బతకమ్మ ఆడేందుకు ప్రయత్నించారు. మరోసారి తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలనూ శాంతింపజేశారు.

>
మరిన్ని వార్తలు