పది ప్రశ్నపత్రం లీక్‌

20 Mar, 2018 09:04 IST|Sakshi
విచారణ జరుపుతోన్నడీఈఓ, ఆర్డీఓ, సీఐ

నార్నూర్‌(ఆసిఫాబాద్‌): పదో తరగతి పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లిషు పేపర్‌–2 ప్రశ్నపత్రం లీక్‌ కావడం, వాట్సాప్‌లో వైరల్‌గా మారడం ఉమ్మడి ఆది లాబాద్‌ జిల్లాలో సోమవారం కలకలం సృష్టించింది. విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం తాడిహత్నూర్‌ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ నెల 15న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు నిర్వహిస్తు న్న విషయం తెలిసిందే.

సోమవారం ఉదయం ఇంగ్లిషు పేపర్‌–2 పరీక్ష ప్రారంభమైన గంటకు అంటే 10.30 గంటలకు వాట్సాప్‌లో ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం హల్‌చల్‌ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పరీక్ష కేంద్రంలో తీసిన ప్రశ్నపత్రం ఫొటో, విద్యార్థులు గోడ దూకి నకలు చిట్టీలు అందిస్తున్న ఫొటోలనూ పెట్టడంతో వైరల్‌ అయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లగా.. ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని, నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నామని తొలుత బుకాయించారు. అంతా సవ్యంగానే జరుగుతున్నాయని సర్ది చెప్పా రు.

లీకైన ప్రశ్నపత్రం కింద విద్యార్థి హాల్‌టికెట్‌ నంబ రు ఉండడం, ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తి స్తున్న ఉపాధ్యాయురాలు కృష్ణవేణి చీర ఫొటోలో కని పిస్తుండడంతో నిజమేనని నిర్ధారణ జరిగింది. ఈ విషయం కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ దృష్టికి వెళ్లింది. వెంటనే పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలియజేయాలని ఆమె ఉట్నూర్‌ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీఈవో జనార్దన్‌రావులను ఆదేశించారు. ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారాన్ని కలెక్టర్‌ తీవ్రంగా పరిగణించడంతో అధికారులు హుటాహుటిన పరీక్ష కేంద్రానికి చేరుకుని విచారణ జరిపారు. 

రూం నంబర్‌ 1లో..
పరీక్ష కేంద్రంలోని రూంనంబర్‌ ఒకటిలో ప్రశ్నపత్రం లీకైనట్లు అధికారులు ధ్రువీకరించారు. అనంతరం పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ భరత్‌చౌహాన్‌ స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ హానోక్‌ ఆధ్వర్యంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై పాఠశాలలో విచారణ జరిపారు. వాట్సాప్‌లో పేపరు లీక్‌ వ్యవహారంపై దృష్టి సారించారు. సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి వాట్సాప్‌లో పంపినట్లు విచారణలో తేలిం ది. సెల్‌ఫోన్‌కు అనుమతి లేదని, పరీక్ష కేంద్రానికి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లడంపై కఠినంగా వ్యవహరిస్తామని అధికా రులు తెలిపారు.

ఇన్విజిలేటర్‌ కృష్ణవేణి, చీఫ్‌ సూపరింటెండెంట్‌(సీఎస్‌) భరత్‌ చౌహాన్, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌(డీవో) జగన్మోహన్, సిట్టింగ్‌ స్క్వాడ్‌ జాడే నాగోరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, ఇన్విజిలేటర్‌ కృష్ణవేణి నార్నూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. మండలంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్‌కాపీయింగ్‌ జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

                     రూం నంబర్‌–1లో బ్లాక్‌ బోర్డుపై రెండో వరుసలో ఉన్న విద్యార్థి హాల్‌టికెట్‌ నంబర్‌ 

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
తాడిహత్నూర్‌ పరీక్ష కేంద్రం నంబర్‌ 1040లో పదో తరగతి ఇంగ్లిష్‌ పేపర్‌–2 ప్రశ్నపత్రం సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీసి వాట్సాప్‌ ద్వారా బయటకు పంపించి లీక్‌ చేసినట్లు విచారణలో తేలింది. పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్‌కు అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్‌ కృష్ణవేణి, సీఎస్‌ భరత్‌ చౌహాన్, డీవో జగన్మోహన్, సిట్టింగ్‌ స్క్వాడ్‌ జాడే నాగోరావులపై శాఖా పరంగా చర్యలు తీసుకుంటాం. పేపర్‌ లీకైనా.. బయట నుంచి జవాబులు విద్యార్థులకు అందలేదు కాబట్టి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయి. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతోపాటు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటాం.
– జిల్లా విద్యాశాఖ అధికారి 
జనార్దన్‌రావు, ఆదిలాబాద్‌

కలెక్టర్‌కు నివేదిక అందిస్తా..
పదో తరగతి ఇంగ్లిషు పేపర్‌–2 లీకైన మాట వాస్తవమే. పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్‌ అనుమతి లేదు. రూమ్‌ నంబర్‌ ఒకటిలో ఫొటో తీసినట్లు తేలింది. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తా.
    – ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, ఉట్నూర్‌

లీక్‌ కాలేదు.. మాల్‌ప్రాక్టీస్‌: కలెక్టర్‌

నార్నూర్‌ మండలం తడిహత్నూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రం లీక్‌ కాలేదని, మాల్‌ప్రాక్టీస్‌ మాత్రమే జరిగిందని కలెక్టర్‌ దివ్య అన్నారు. సోమవారం సా యంత్రం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సోమవారం జరిగిన ఇంగ్లిష్‌ పేపర్‌–2 లీక్‌ అయ్యిందన్న ప్రచారం అవాస్తమని చెప్పారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికి మాల్‌ప్రాక్టీస్‌ జరిగినట్లు గుర్తించామని అన్నారు. ఉట్నూర్‌ ఆర్డీవోతో విచారణ జరి పించి చీఫ్‌ సూపరింటెం డెంట్‌ భరత్‌ చౌహన్, డిపార్ట్‌మెంటల్‌ అధికారి జగన్మోహన్, కస్టోడియన్‌ అధికారి నాగోరావ్, ఇన్వి జిలెటర్‌ కృష్ణవేణిలను పరీక్షల నిర్వహణ విధుల నుంచి తొలగించడంతోపాటు సస్పెండ్‌ చేశామని చెప్పారు. పోలీసు కేసు నమోదు చేశామని, పరీక్ష కేం ద్రాల్లో మాల్‌ ప్రాక్టీస్, కాపీయింగ్‌ తదితర చర్యలను సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత 15న జరిగిన పరీక్షలో భాగంగా చీఫ్‌ సూపరింటెండెంట్‌గా నిర్వహించిన ఉట్నూర్‌ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాదవ్‌ సుమన్, డిపార్ట్‌మెంటల్‌ అధికారి ఇంద్రవెల్లి ఆశ్రమ పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌ యాసిన్‌ షరీఫ్, ఇన్విజిలేటర్లు ఉట్నూర్‌ ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధా నోపాధ్యాయురాలు రాథోడ్‌ చంద్రకళ, ఉట్నూర్‌ ప్రాథమికోన్నత పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌ జె.రమేశ్‌ కుమార్‌లను పరీక్ష నిర్వహణ విధుల నుంచి తొలగించడంతోపాటు సస్పెండ్‌ చేశామని వివరించారు. వీరిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఈవో జనార్దన్‌రావు, అడిషినల్‌ ఎస్పీ మెహన్, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు