తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు

17 Mar, 2017 17:24 IST|Sakshi
తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు
హైదరాబాద్‌: ఉత్తర ప్రదేశ్ రైతులకు రూ. 50 వేల కోట్ల రుణమాఫీని కేంద్రప్రభుత్వమే భరిస్తోందని.. మరి తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు? అని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, గణేష్ గుప్తా, చింతా ప్రభాకర్లు టీఆర్‌ఎస్‌ఎల్‌పీలో విలేకరులతో మాట్లాడారు.

తాము నాలుగు విడతలుగా 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. కేంద్రం తెలంగాణ రైతుల రుణ మాఫీ విషయంలో భాద్యత తీసుకోదా? అని సూటిగా అడిగారు. కనీసం తెలంగాణ రుణంలో 50 శాతం కేంద్రం భరించ లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అన్నింటా వివక్షతకు గురైన రాష్ట్రం అని పేర్కొన్నారు. దోచుకోబడ్డ తెలంగాణకు మీరు న్యాయం చేయరా అని అడిగారు. దోచుకున్న ఏపీకి ప్రత్యేక ప్యాకేజీయా? అని మండిపడ్డారు.

బనారస్ హిందూ విశ్వ విద్యాలయం కోసం రూ.100 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఉస్మానియాకు నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కానీ కొన్ని విషయాల్లో కేంద్రం తీరు సక్రమంగా లేదన్నారు. రాజకీయ కోణంలో రాష్ట్రాలకు కేటాయింపులు సరికాదని అన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు పీఎం మోదీపై ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి నిధులు వచ్చేలా చేయాలని కోరారు. వెంటనే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. రైతులకు సంబంధించిన విషయంలో జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండాలని డిమాండ్‌ చేశారు.
>
మరిన్ని వార్తలు