బస్టాండ్@ సీబీడీ

18 Apr, 2016 01:38 IST|Sakshi

ప్రయాణ ప్రాంగణం.. ఇక వ్యాపార కేంద్రం
సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా అభివృద్ధి
రూ. 620 కోట్లతో బహుళ అంతస్తుల భవనం
కింద బస్‌స్టేషన్,  పైన వాణిజ్య సముదాయం

 

హన్మకొండ :  ఇప్పటివరకు అంతంత మాత్రంగానే అభివృద్ధి చెందిన జిల్లా బస్‌స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయి. స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా హన్మకొండ నడిబొడ్డున విస్తరించిన ఈ బస్టాండ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పునర్ నిర్మిం చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రభత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రూ. 620 కోట్ల వ్యయంతో బహుళ అంతస్తులుగా నిర్మించనున్నారు.

 సమస్యలకు సెలవు..

 
నగరం నడిబొడ్డున విస్తరించి ఉన్న బస్టాండ్ ప్రాంతంలో చిన్నాచితక వ్యాపారాలే జరుగుతున్నాయి. అంతేకాక నిత్యం 1553 బస్సులు ఈ బస్‌స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజు 1.30 లక్షల మంది ఇక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు. అరుుతే బస్సులు, ప్రయూణికుల సంఖ్యకు అనుగుణంగా బస్ స్టేషన్ లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నారుు. 19 ఫ్లాట్‌ఫారాలు మాత్రమే ఉన్నారుు. ఇక స్మార్ట్‌సిటీ పథకం ద్వారా ఈ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. హన్మకొండ బస్‌స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక సిద్ధమైంది. అవసరమైన వనరులు సమకూరితే రాష్ట్రంలోని మిగిలిన బస్‌స్టేషన్లకు ఆదర్శంగా  హన్మకొండ బస్టాండ్ నిలిచే అవకాశం ఉంది.

 

సీబీడీగా గుర్తింపు...

స్మార్ట్‌సిటీ నిబంధన ప్రకారం నగరంలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ఆధునాతనంగా అభివృద్ధి (రిట్రోఫిట్టింగ్) చేయాలి. ఎంపిక చేసిన ప్రాంతంలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. దీని ప్రకారం రూ.2,681 కోట్ల వ్యయంతో హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి పోతనరోడ్డు వరకు 1523 ఎకరాలు ఎంపిక చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లు, నాలాలు, విద్యుత్, నీటి సరఫరా అన్నింటీని మెరుగుపరుస్తారు. ముఖ్యంగా  రెట్రోఫిట్టింగ్ ప్రాంతంలో పర్యాటకుల కోసం భద్రకాళి చెరువు పరిసర ప్రాంతాన్ని, వ్యాపార కేంద్రంగా హన్మకొండ బస్‌స్టేషన్ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణాళిక తయూరు చేస్తున్నారు. ఇలా ఎంపిక చేసిన ప్రాంతాన్ని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ)గా పేర్కొంటారు.

 
బహుళ అంతస్తుల భవనం..

స్మార్ట్‌సిటీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లేదా వాణిజ్య కేంద్రంగా హన్మకొండ బస్‌స్టేషన్ పరిసర ప్రాంతాలను రూ. 620 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. హన్మకొండ బస్‌స్టేషన్, బస్‌డిపోలు విస్తరించి ఉన్న 13.2 ఎకరాల స్థలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఇక్కడ మొత్తం నాలుగు అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తారు. ఇందులో సెల్లార్, బేస్‌మెంట్ లెవల్‌లో 60 శాతం ప్రదేశాన్ని పార్కింగ్‌కు కేటాయిస్తారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఫ్లాట్‌ఫారాలు, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. మొదటి అంతస్తులో ప్రయాణికుల విశ్రాంతి గదులు, షాపింగ్ సెంటర్‌ను అందుబాటులో ఉంచుతారు. రెండు, మూడు, నాలుగు అంతస్తులను వాణిజ్య కేంద్రాలుగా మారుస్తారు. ఇందులో కార్యాలయాలు, సినిమా థియేటర్లు, ఫుడ్‌కోర్టు, ఎంటర్‌టైన్‌మెంట్ తదితర అవసరాలకు అద్దె ప్రతిపాదికన కేటాయిస్తారు. భవనం పైన పూర్తిగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఈ భవనంపై పడే ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకునేలా ఇంకుడు గుంతలు నిర్మిస్తారు.

   

మరిన్ని వార్తలు