ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ చేయాలి

14 Oct, 2015 19:15 IST|Sakshi

వరంగల్ అడవుల్లో జరిగిన పోలీసుల బూటకపు ఎన్‌కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని విప్లవ రచయితల సంఘం సభ్యుడు తంగళ్ల సుదర్శన్ డిమాండ్ చేశారు. పోలీసులు చేసిన బూటకపు ఎన్ కౌంటర్ లో తన కుమార్తె శృతి మృతి చెందిందని తెలిపారు.

బుధవారం ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్‌కౌంటర్‌ దోషులపై 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే ఎన్‌కౌంటర్లు ఉండవని, నక్సలైట్ల ఎజెండానే అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. మాట తప్పారని అన్నారు. ప్రజా వ్యతిరేకులు, ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇస్తున్నారని.. మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమం సందర్భంగా తన కూతురు శృతి ఊరూరా తిరిగి.. తెలంగాణ పాటలు పాడిందని గుర్తుచేసుకున్నారు. అలాంటి శృతిని ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారన్నారు.
 

మరిన్ని వార్తలు